ఆ పొరపాటే కాపాడింది.. కూలిపోయిన బ్రెజిల్ విమానాన్ని మిస్ అయిన ప్రయాణికుడు
- ఆలస్యంగా వచ్చాడని అడ్డుకున్న విమానాశ్రయ సిబ్బంది
- ఇంకా టైముందిగా విమానం ఎక్కనివ్వాలని గొడవ పెట్టుకున్న ప్యాసింజర్
- విమానం క్రాష్ ల్యాండ్ వార్త చూశాక సదరు ఉద్యోగి ప్రాణభిక్ష పెట్టాడని కృతజ్ఞత
శుక్రవారం రాత్రి బ్రెజిల్ లో ఓ విమానం కూలిపోయి అందులోని మొత్తం 62 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఓ ప్రయాణికుడు చిన్న పొరపాటు కారణంగా ఆ విమానం ఎక్కలేకపోయాడు. రియో డి జెనీరో ప్రాంతానికి చెందిన అడ్రియానో అసిస్ శుక్రవారం కాస్కావెల్ నుంచి గ్వారుల్హోస్కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. టైముకు ఎయిర్ పోర్టుకు కూడా చేరుకున్నాడు. అయితే, తాను బుక్ చేసుకున్న టికెట్ ‘లాటమ్ ఎయిర్ లైన్స్’ కంపెనీదని భావించి ఆ ఫ్లైట్ కోసం లాంజ్ లో వేచి ఉన్నాడు.
కాసేపటి తర్వాత టికెట్ చూసుకోగా అది ‘వోపాస్ ఎయిర్లైన్స్’ టికెట్.. అటుచూస్తే వోపాస్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అసిస్ హడావుడిగా బోర్డింగ్ గేట్ వద్దకు చేరుకున్నాడు. కానీ అప్పటికే బోర్డింగ్ క్లోజ్ చేశామంటూ అక్కడున్న సిబ్బంది అసిస్ ను విమానంలోకి ఎక్కనివ్వలేదు. దీనిపై అసిస్ వారితో తీవ్రంగా గొడవ పెట్టుకున్నాడు. తర్వాత వోపాస్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విమానాశ్రయం మొత్తం వెతికి తనను అడ్డుకున్న ఉద్యోగిని కలిశానని, అతడిని కౌగిలించుకుని కృతజ్ఞతలు చెప్పానని అసిస్ వివరించాడు.