శాకాహారం ఆర్డర్ ఇస్తే మాంసాహారం పంపించారు.. జొమాటో కస్టమర్కు షాక్
- ఢిల్లీ యువతికి ఊహించని అనుభవం
- ఎక్స్ వేదికగా ఫొటోలు షేర్ చేసిన కస్టమర్
- క్షమాపణలు కోరిన జొమాటో
ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ ఇస్తే మాంసాహార వంటకం వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘‘ జొమాటో ద్వారా ఈట్ఫిట్ నుంచి పాలక్ పనీర్ సోయా మటర్, మిల్లెట్ పులావ్ ఆర్డర్ చేశాను. అయితే పాలక్ పనీర్కు బదులు చికెన్ పాలక్ని డెలివరీ చేశారు. నేను శాకాహారం మాత్రమే ఆర్డర్ పెట్టినప్పుడు చికెన్ డెలివరీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఈ పోస్టుపై స్పందించిన జొమాటో క్షమాపణ కోరింది. సమస్యను పరిశీలిస్తున్నామని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చింది. తప్పును సరిదిద్దుకుంటామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై ఈట్ఫిట్ రెస్టారెంట్ కూడా క్షమాపణలు కోరింది. ‘‘మీకు ఎదురైన అనుభవం పట్ల చింతిస్తున్నాం. దయచేసి మీ ఆర్డర్, సంప్రదింపు వివరాలు అందించండి’’ అని కోరింది.