టీచర్ కు బదిలీ.. టీసీ తీసుకొని పోలోమంటూ వెనకే వెళ్లిన వందమందికి పైగా స్టూడెంట్లు
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఘటన
- సారు వెళ్లే బడికే వెళతామంటూ పట్టుబట్టిన విద్యార్థులు
- 3 కి.మీ. దూరంలోని స్కూలులో చేర్పించిన తల్లిదండ్రులు
పొనకల్ ప్రాథమిక పాఠశాలలో 2012 జులై 13న జాజాల శ్రీనివాస్ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) గా అడుగుపెట్టారు. అప్పట్లో మొత్తం ఐదు తరగతుల్లో కేవలం 32 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉండేవారు. శ్రీనివాస్ పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించడం, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా 250కి చేరింది. ఈ క్రమంలో శ్రీనివాస్ కు అదే మండలంలోని మరో స్కూలుకు బదిలీ అయింది.
ఈ నెల 1న పొనకల్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపెల్లిగూడ స్కూలులో శ్రీనివాస్ జాయినయ్యారు. ఆ రోజు స్కూలులో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య కేవలం 21 మాత్రమే.. రెండు రోజుల్లోనే ఈ సంఖ్య 154 కు చేరింది. దీనికి కారణం పొనకల్ స్కూలులో చదువుకుంటున్న విద్యార్థులే. శ్రీనివాస్ సార్ వెళ్లే బడికే వెళతామని పిల్లలు మారాం చేయడంతో తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ స్కూలులో చేర్పించారు. కాగా, ఈ పాఠశాలలో జాజాల శ్రీనివాస్తోపాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.