రామోజీరావుకు వెంకయ్య నాయుడు, చిరంజీవి నివాళి

Venkaiah Naidu Chiranjeevi pay tributes to Ramoji Rao
  • మీడియా మొఘల్ మృతిపై ప్రముఖుల సంతాపం
  • వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగారంటూ రామోజీరావుకు వెంకయ్య నాయుడి నివాళి
  • ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతమంటూ చిరంజీవి పోస్ట్
అనారోగ్యంతో కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీ రావుకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. ‘రామోజీరావు వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం’’ అని వెంకయ్య నాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రామోజీరావు మృతిపై సినీనటుడు చిరంజీవి కూడా సంతాపం తెలిపారు. ‘‘ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికెగిసింది’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 

గత కొంత కాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యులు స్టెంట్ అమర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు.
Go Back to Shorts
Ramoji Rao
Venkaiah Naidu
Chiranjeevi
Eenadu

More Telugu News