Virat Kohli: సెంచరీ మిస్ చేసుకున్న కోహ్లీ... ఆర్సీబీ భారీ స్కోరు

  • ధర్మశాలలో ఆర్సీబీ × పంజాబ్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగులు చేసిన ఆర్సీబీ
  • 47 బంతుల్లో 92 పరుగులు చేసిన కోహ్లీ
  • రజత్ పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్
Kohli misses ton against Punjab Kings

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్  తాజా సీజన్ కాస్త ఆలస్యంగా ఫామ్ లోకి వచ్చింది. అయితేనేం, అదరగొట్టే ఆటతో దూసుకుపోతోంది. ఇవాళ ఆర్సీబీ... పంజాబ్ కింగ్స్ తో తలపడుతోంది. 

ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ విధ్వంసక ఆటతీరుతో కదం తొక్కడం ఈ ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది. 

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (9) త్వరగానే అవుటైనప్పటికీ, కోహ్లీ పరుగుల బీభత్సం సృష్టించాడు. మొత్తం 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. సెంచరీకి 8 పరుగుల దూరంలో అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 

మరో ఎండ్ లో రజత్ పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. పాటిదార్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 46 పరుగులు సాధించాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు బాది 18 పరుగులు చేశాడు. 

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, విద్వత్ కావేరప్ప 2, అర్షదీప్ సింగ్ 1, కెప్టెన్ శామ్ కరన్ 1 వికెట్ తీశారు. 

ఇక 242 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకుంది. 6 పరుగులు చేసిన ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 2 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. బెయిర్ స్టో (6 బ్యాటింగ్), రిలీ రూసో (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News