KTR: ప్రధాని నరేంద్రమోదీపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నల వర్షం

  • దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పాలని... సమాజంలో విభజన తీసుకురావొద్దన్న కేటీఆర్
  • ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఆగ్రహం
  • చేనేత రంగంపై జీఎస్టీ వేసి మగ్గానికి మరణశాసనం రాశారన్న కేటీఆర్
KTR questions to PM Narendra Modi

తెలంగాణకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సమాజం తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా అనుసంధానం ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. 'ఫిరమైన ప్రధాని' మోదీగారు అంటూ ప్రశ్నలు కురిపించారు. దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పాలని... దయచేసి సమాజంలో విభజన తీసుకురావొద్దని కోరారు. తెలంగాణ గడ్డ... ప్రజాచైతన్యానికి అడ్డ అని పేర్కొన్నారు.

'దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..! దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి..!!
ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి..!!
ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు.. ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి..!!
మా యువతకు ఉపాధినిచ్చే... కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పండి..!!

మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే.. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారో చెప్పండి..!!
మా నవతరానికి కొండంత భరోసానిచ్చే.. ఐటీఐఆర్  ITIR, Hyderabad ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పండి..!!
తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న..  లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పండి..!!
తెలంగాణకు ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజీ.. ఒక్క నర్సింగ్ కళాశాల, ఒక్క ఐఐటీ, ఒక్క ట్రిపుల్ ఐటీ.. 
ఒక్క ఐఐఎం, ఒక్క ఐసర్, ఒక్క ఎన్.ఐ.డీ. ఎందుకు ఇవ్వలేదో చెప్పండి..!!

సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని.. మా రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారో చెప్పండి..!!
లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా.. 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా.. తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పండి..!! 

చేనేత రంగంపై జీఎస్టీ వేసి.. మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారో చెప్పండి..!!
తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పండి..!!
మండిపోతున్న నిత్యావసర ధరలను.. ఎందుకు అదుపు చేయలేకపోయారో చెప్పండి..!!
ముడి చమురు ధరలు తగ్గినా.. మోడీ హయాంలో Petrol, Diesel ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పండి..!!
భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు.. మీరిచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పండి..!!

సబ్ కా సాత్, అచ్చే దిన్ లాంటి నినాదాలు.. ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పండి..!!
మీ పాలనలో పదేళ్లు గడిచినా..  ఇంకా ఉచిత రేషన్ పథకం కింద.. 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పండి..!!
అవినీతిపరులకు మీ పార్టీలో ఆశ్రయమిచ్చి.. రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను.. 
ఎందుకు ప్రయోగిస్తున్నారో చెప్పండి ..!! డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన.. 
భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి.. అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయకండి..!!

దేశ ప్రధాన మంత్రిగా.. ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా.. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేయకండి..!!
దేశం కోసం ఏదైనా “విజన్” ఉంటే చెప్పండి..!  కానీ.. దయచేసి సమాజంలో “డివిజన్” మాత్రం సృష్టించకండి..!! 
చివరగా ఒక మనవి... రెచ్చగొట్టే రాజకీయాలకు.. ఇక్కడ ఓట్లు పడవు..! 
ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డ..!!' అంటూ ప్రశ్నలు సంధించారు.

  • Loading...

More Telugu News