KCR: నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

  • తాను అవినీతి చేయలేదు కాబట్టే మోదీకి దొరకలేదన్న కేసీఆర్
  • మద్యం పాలసీలో కుంభకోణం సృష్టించి కవితను ఇరికించారని ఆరోపణ
  • కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టీకరణ
  • దక్షిణాదిలో బీజేపీకి 12 సీట్లు వస్తే ఎక్కువన్న బీఆర్ఎస్ అధినేత
BRS chief KCR sensational comments on Modi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది మోదీ వికృత రూపానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మద్యం పాలసీలో కుంభకోణాన్ని సృష్టించి అందులో కవితను ఇరికించారని ఆరోపించారు.

పదేళ్ల తమ పాలనలో అద్భుతాలు చేశామన్న కేసీఆర్ ఐదు నెలల పాలనలోనే ప్రజల్ని రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం కనిపిస్తుందని, బీఆర్ఎస్ గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమన్న సీఎం రేవంత్‌రెడ్డి తోకముడిచారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయేకు మెజార్టీ వచ్చే పరిస్థితి ఎంతమాత్రమూ లేదన్న కేసీఆర్.. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తుడిపెట్టుకు పోతుందన్నారు. దక్షిణాదిలో బీజేపీకి 12 సీట్లు వస్తేనే ఎక్కువని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News