Chandrababu: ఇప్పుడు మనకు మోదీ గ్యారెంటీ ఉంది: అనకాపల్లి సభలో చంద్రబాబు

  • అనకాపల్లిలో ప్రజాగళం సభ
  • హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు
  • ప్రధాని మోదీ వెళ్లిపోయాక చంద్రబాబు ప్రసంగం
  • మోదీ అనకాపల్లి సభ ద్వారా స్పష్టమైన భరోసా ఇచ్చారన్న టీడీపీ అధినేత 
Chandrababu says now alliance have Modi guarantee

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అనకాపల్లి ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ అనకాపల్లి సభ ద్వారా ఏపీ భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చారని తెలిపారు. తద్వారా రాబోయే రోజుల్లో ఏపీకి అన్నీ మంచి శకునాలే, వైసీపీకి అన్నీ పీడ శకునాలే అని అభివర్ణించారు. 

మూడు పార్టీలు ఎందుకు కలిశాయని చాలామందికి సందేహాలు ఉన్నాయని, దానిపై నిన్న అమిత్ షా స్పష్టంగా వివరణ ఇచ్చారని, ఇవాళ మోదీ చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. 

పవన్ కు ఆ గౌరవం చాలకనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఒకే మాట చెబుతున్నాడు... సైకోజగన్ పోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి... ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయన సీట్ల కోసం ఆలోచించలేదు. ఆయనకు సినీ జీవితంలో గౌరవం లేకనా? అంతకుమించిన గౌరవం ఇక్కడొస్తుందని ఆయన రాజకీయాల్లోకి రాలేదు. తనను నమ్ముకున్న ఈ ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 

నాడు ఇదే విశాఖకు పవన్ వస్తే అడుగడుగునా ఆటంకాలు కల్పించారు, ఉన్నపళంగా వేరే ప్రాంతానికి తరలించారు. విశాఖపట్నం వీళ్లబ్బ సొమ్ము అని సైకో అనుకుంటున్నాడు. విశాఖ ఏమైనా వీళ్ల తాత జాగీరా? 

వ్యక్తిగత విమర్శలు చేశాడు. పవన్ ను ఎంతో అవమానించాడు. పవన్ కు ఇక్కడ విశాఖలో జరిగిన అవమానం జరిగిన తర్వాత నేను విజయవాడ వెళ్లి కలిసి ఆయనకు సంఘీభావం తెలిపాను. తిరిగి నన్ను జైల్లో పెట్టిన తర్వాత, ఇంకేమీ ఆలోచించకుండా పొత్తు ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కల్యాణ్. అదీ ఆయన చిత్తశుద్ధి. సినిమాల్లోనే హీరో కాదు... ప్రజా జీవితంలో నిజమైన హీరో పవన్. 

మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అవమానాలు భరించాం... ప్రజలను కాపాడుకునేందుకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఇవాళ చెబుతున్నా... ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరు. మోదీ కూడా చెప్పారు... గెలుపు మనదే. సైకోను ఎక్కడికి పంపించాలో ప్రజలే నిర్ణయించాలి. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి ఈ సైకో. 

అదే మా కల!

ప్రధాని మోదీ గత పదేళ్లలో దేశాన్ని ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. రాబోయే ఐదేళ్లలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తామని సంకల్పం ప్రకటించారు. 2047 నాటికి వికసిత్ భారత్ అనేది మోదీ కల... అదే సమయంలో వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది నా కల, పవన్ కల్యాణ్ కల! 

ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ కావాలి, దేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం కావాలి, ప్రపంచంలో తెలుగుజాతి నెంబర్ వన్ కావాలి, పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం ఈ కూటమి ద్వారా సాధిస్తాం. ఇప్పుడు మనకు మోదీ గ్యారెంటీ ఉంది, మన సూపర్ సిక్స్ ఉంది. అదేవిధంగా నేను, పవన్ కల్యాణ్ కలిసి ఎన్నికల  మేనిఫెస్టో తీసుకువచ్చాం. మన మేనిఫెస్టో రావడంతోనే సైకో మేనిఫెస్టో వెలవెలపోయింది. 

మన మేనిఫెస్టోకు ఆదరణ పెరిగింది. 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలుస్తున్నాం. 160 అసెంబ్లీ సీట్లు కూటమే గెలుస్తుంది. సైకోను ఇంటికి పంపిస్తాం. ఎన్ని నాటకాలు వేశాడు ఇతడు. 2019కి ముందు ఊరూరా తిరిగాడు. ఆ రోజున నేను తలుచుకుని ఉంటే బయట తిరిగేవాడా? అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు! 

ఇప్పుడీ ముఖ్యమంత్రి కొత్తగా టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చాడు. ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా... భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస్ బుక్ పై ఎవరి ఫొటో ఉండాలి? జగనన్న భూ హక్కు అంట! భూములు ఇచ్చింది నీ తాతలా? మా తాతలు మాకు ఇచ్చారు... దానిపై నీ ఫొటో ఏంది? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నేను నా పాస్ పుస్తకంపై సైకో ఫొటో పెట్టుకోవాలా? 

సీన్ మారిపోయింది!

నిన్న ఉద్యోగులను చూస్తే కడుపు నిండిపోయింది. నిన్న, ఇవాళ పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైసీపీ వాళ్లు వెళితే... ఒంగోలులో ఛీ కొట్టారు. 

వాళ్లిచ్చిన డబ్బులు తీసుకోకుండా ఓ మహిళ మా క్యాంపు వద్దకు వచ్చి... వాళ్ల డబ్బును ఛీ కొట్టాం, నేను రూ.10 వేలు ఇస్తున్నా... ఈ డబ్బును పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించాలని కోరిందంటే సీన్ ఎలా మారిపోయిందో అర్థమైందా? ఉద్యోగులంతా కూటమికే ఓట్లేశారు, వేస్తున్నారు కూడా. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గెలుపు మనదే. సైకో... నీ సీన్ అయిపోయింది, ఇక నీ డబ్బులు పనిచేయవు. 

మళ్లీ అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం

ఇవాళ మోదీ చెప్పినట్టు  మళ్లీ పోలవరం కడతాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం. మోదీ గ్యారెంటీలను, మన మేనిఫెస్టోను శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఇవాళ ఇతడి డ్రామాలన్నీ అయిపోయాయి. 2014లో తండ్రి లేని బిడ్డనని వచ్చాడు. మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని, వాళ్ల షాపులపై దాడి చేశాడు. 2019లో గెలిచాక, రిలయన్స్ అధినేత చెప్పిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చాడు. ఇదీ ఆయన రాజకీయ నీతి! 

హూ కిల్డ్ బాబాయ్ అంటే అందరికీ అర్థమైంది... జగ్గూ భాయ్ కి మాత్రం అర్థం కాలేదు. అందరూ వెళ్లి జగ్గూ భాయ్ చెవిలో చెప్పాలి... నువ్వే మీ బాబాయ్ ని చంపి నాటకాలు ఆడుతున్నావు అని చెప్పాలి. 

ఇది నాకు ఇష్టమైన సిటీ

విశాఖ నేను మెచ్చిన నగరం. ఈ జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. ఇది మంచి వాళ్లు ఉండే ప్రాంతం. హుద్ హుద్ తుపాను వస్తే 10 రోజులు ఇక్కడే ఉన్నాను. మోదీ వచ్చి సంఘీభావం తెలిపి పూర్తిగా సహకరించారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలు చూపిన ఆదరణ నా జీవితంలో మర్చిపోలేను. 

గత ఎన్నికల్లో ఇక్కడ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారంటే అదీ ఇక్కడి ప్రజల మంచితనం. మంచి చేస్తే మర్చిపోని ప్రజానీకం విశాఖ ప్రజలు. అలాంటి విశాఖ ఇవాళ వైసీపీ నేతల దోపిడీకి కేంద్రంగా మారింది. భూముల మీద కన్నేశారు, అభివృద్ధి ఆగిపోయింది, ఏదైనా ఒక్క పని చేశారా? మెట్రో వస్తుందా ఇప్పుడు? 

'భోగాపురం' నాశనం చేశారు

భోగాపురం ఎయిర్ పోర్టుకు నేను శంకుస్థాపన చేశాను. నేను అధికారంలో ఉంటే రెండేళ్లలో ఎయిర్ పోర్టు వచ్చేది. కానీ ఈ సైకో నాశనం చేశాడు. నేను చేసిన శంకుస్థాపన స్థానంలో ఈయన మళ్లీ శంకుస్థాపన చేశాడు. ఇతడొక స్టిక్కర్ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి. అందుకే, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలి. 

ఇవాళ మోదీ చెప్పారు... ప్రపంచ ఐటీ రంగంలో తెలుగువారు దూసుకుపోతున్నారని చెప్పారు. అదీ మనం వేసుకున్న పునాది.. అందులో నాకు భాగం ఉందని చెప్పడానికి గర్విస్తున్నా. రేపు అధికారంలోకి వచ్చాక మళ్లీ సంపద సృష్టిస్తాం... ఆదాయాన్ని పెంచుతాం... పెంచిన ఆదాయాన్ని పేదలకు ఇస్తాం... అదే సమయంలో అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళతాం" అని చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News