Charanjit Singh Channi: వాయుసేన కాన్వాయ్‌పై ఉగ్రదాడి బీజేపీ స్టంట్.. పంజాబ్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్య

  • ఈ స్టంట్లతో బీజేపీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలనుకుంటోందన్న కాంగ్రెస్ నేత చరణ్‌జీత్ ఛన్నీ 
  • ప్రజల ప్రాణాలు, దేహాలతో బీజేపీ చెలగాటమాడుతోందని విమర్శ 
  • గత ఎన్నికల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని వ్యాఖ్య
Poonch attack BJPs pre poll stunt Big charge by Congresss Charanjit Channi

కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ ఆదివారం మరో కాంట్రవర్సీకి తెరతీశారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో వాయుసేన కాన్వాయ్‌పై దాడిని బీజేపీ ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు.  ‘‘ఇవన్నీ స్టంట్స్.. టెర్రరిస్టు దాడులు కాదు. ఇవన్నీ ఎన్నికలు ముందు బీజేపీ స్టంట్లు. వీటిల్లో నిజం లేదు. ప్రజల ప్రాణాలు, దేహాలతో బీజేపీ చెలగాటమాడుతోంది’’ అని చరణ్‌జిత్ సింగ్ అన్నారు. 

ఇలాంటి ఘటనలతో బీజేపీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఛన్నీ అన్నారు. ముందస్తు ప్రణాళికలతో బీజేపీ విజయావకాశాలు పెంచేందుకు ఈ దాడుల రూపకల్పన జరిగిందని ఆరోపించారు. ‘‘ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇలాంటి స్టంట్లు ప్లే చేస్తుంటారు. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి దాడులు జరిగాయి’’ అని ఆయన అన్నారు. 

పూంచ్‌ జిల్లాలోని సనాయ్ గ్రామంలో శనివారం ఉగ్రవాదులు వాయుసేన కాన్వాయ్‌పై ఏకే-47 రైఫిళ్లతో దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిలో ఒకరు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. దాడి తరువాత ఉగ్రవాదులు సమీప అడవిలోకి పారిపోయారని అధికారులు భావిస్తున్నారు. టెర్రరిస్టుల జాడ కనిపెట్టేందుకు స్థానికంగా భారీ సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో స్థానిక పోలీసులతో పాటు ఆర్మీ కూడా పాలుపంచుకుంది. 

మరోవైపు ఈ దాడిని రాహుల్ గాంధీ ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దాడిలో అమరులైన సైనికుడికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేశారు. దాడిలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News