Narendra Modi: కేసీఆర్ వస్తే పొత్తులు ఉండవని చెప్పా... ఆయన అబద్దాలు చెబుతున్నారు: టీవీ9తో ప్రధాని మోదీ

  • తెలంగాణలో కమీషన్ లేకుండా ఏ పనీ జరగడం లేదని ఆరోపణ
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అని వ్యాఖ్య
  • తెలంగాణలో తమకు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం
  • అవినీతిలో కాంగ్రెస్ పార్టీకి స్వర్ణపతకం ఇస్తే, బీఆర్ఎస్‌కు రజతం ఇవ్వాలని ఎద్దేవా
  • ఏపీలో మిత్రపక్షాలను కలుపుకొని వెళతాం... ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు వెల్లడి
  • యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామన్న ప్రధాని
  • తనను తిట్టేందుకు తిట్లు అయిపోయాయని... ఇక రీసెర్చ్ చేయాలని చురక
PM Narendra Modi with TV9

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వద్దకు వస్తే పొత్తులు ఉండవని స్పష్టం చేశానని... కానీ ఆయన అబద్దాలు చెబుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో కమీషన్ లేకుండా ఏ పనీ జరగడం లేదన్నారు. గురువారం టీవీ9 ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమకు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతిలో కాంగ్రెస్ పార్టీకి స్వర్ణపతకం ఇస్తే, బీఆర్ఎస్‌కు రజతం ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము మిత్రపక్షాలను కలుపుకొని వెళతామన్నారు. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు చెప్పారు.

బెంగాల్‌లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సందేశ్‌కాలిలో పేద మహిళకు టిక్కెట్ ఇచ్చినట్లు చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు తమ వైపే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్దవ్ ఠాక్రే ఎప్పటికీ బాల్ ఠాక్రే వారసుడు కాలేడన్నారు. ఔరంగజేబును పొగిడినవారితో ఆయన పొత్తు కుదుర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్లు ముఖ్యమంత్రి పదవి కోసం తన్నుకుంటున్నారన్నారు. గుజరాత్‌లో సమగ్ర అభివృద్ధి జరుగుతోందని, అందుకే ప్రజలు గుజరాత్ మోడల్‌ను ఆదరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకప్పుడు గుజరాత్‌లో నీటి కష్టాలు ఉండేవని... ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అందుకే అంతర్జాతీయ పెట్టుబడులు పెరిగినట్లు చెప్పారు. 2002లో అక్కడ చివరిసారి మతకల్లోహాలు జరిగాయని... నాటి నుంచి ఇప్పటి వరకు ఆ మాట వినబడదన్నారు. పేదలు తనను అమితంగా ప్రేమిస్తారని పేర్కొన్నారు.

యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తాం

తాము యూనిఫామ్ సివిల్ కోడ్‌ను తప్పకుండా అమలు చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రాజ్యాంగం కూడా దీనిని సమర్థించిందన్నారు. సుప్రీంకోర్టు యూసీసీపై కేంద్రాన్ని ప్రశ్నించిందని గుర్తు చేశారు. ఒకే దేశంలో ఒకే చట్టం ఉండాలని రాజ్యాంగం కూడా చెబుతోందన్నారు. అయోధ్య రాముడిని విపక్షాలు అవమానించాయని మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని తాము ఎప్పుడూ గౌరవిస్తామని.. అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు. వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందన్నారు. ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మతరిజర్వేషన్లకు అవకాశమిచ్చేది లేదన్నారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. తాము గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారన్నారు. ముస్లిం లీగ్ ప్రేరణతో కాంగ్రెస్ మేనిఫెస్టో తయారయిందన్నారు.

నన్ను తిట్టడానికి రీసెర్చ్ చేయాలి

తనను తిట్టడానికి కాంగ్రెస్ సహా విపక్షాల వద్ద తిట్లు అయిపోయాయని, మరింత తిట్టాలంటే రీసెర్చ్ చేయాలని చురక అంటించారు. గ్యారంటీలపై తనకు ఎలాంటి కాపీరైట్స్ లేవన్నారు. రాహుల్ గాంధీ గ్యారంటీలపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు. గ్యారంటీలు అమలు చేయాలంటే పెద్ద తపస్సు చేయాలన్నారు. కాంగ్రెస్ హామీలను చూసి నేతలపై నమ్మకమే పోతోందన్నారు. అయినా నకిలీ వస్తువులు అమ్మేవారు బాగా ప్రచారం చేస్తారని ఎద్దేవా చేశారు.

తన నిర్ణయాలతో ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఆ నమ్మకమే 2024లో గ్యారంటీ అన్నారు. ఏది సాధ్యమో... ఏది అసాధ్యమో తనకు తెలుసునన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని, ఎన్నో కష్టాలను భరించి ఈస్థాయికి వచ్చానన్నారు. ఎస్పీజీ భద్రత కారణంగా తక్కువ సభల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు.

More Telugu News