Maheshwar Reddy: అలాంటి పార్టీతో రేవంత్ రెడ్డి ఫైనల్ మ్యాచ్ ఆడుతారంట: మహేశ్వర్ రెడ్డి సెటైర్లు

  • ఒకప్పుడు 400 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌కు ఇప్పుడు కనీసం 300 చోట్ల అభ్యర్థులు లేరని ఎద్దేవా
  • కాంగ్రెస్.. రీజినల్ పార్టీకి ఎక్కువ... జాతీయ పార్టీకి తక్కువ అని సెటైర్
  • ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదన్న బీజేపీఎల్పీ
Maheshwar Reddy satires on congress and revanth reddy

కాంగ్రెస్ రీజినల్ పార్టీకి ఎక్కువ... జాతీయ పార్టీకి తక్కువ... అలాంటి పార్టీని పట్టుకొని బీజేపీతో ఫైనల్ మ్యాచ్ ఆడుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి రాబోదని జోస్యం చెప్పారు. ఒకప్పుడు 400 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం 300 సీట్లలో అభ్యర్థులే లేరన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. కాంగ్రెస్ గెలిచే నలభై యాభై సీట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.

కెప్టెన్ లేకుండా రేవంత్ రెడ్డి ఫైనల్ మ్యాచ్ ఎలా ఆడుతారు? అని ప్రశ్నించారు. ఇండియా కూటమి 50 సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎవరికో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రెండుసార్లు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిందని విమర్శించారు.

  పెద్దవాళ్ల మీద రాళ్లేస్తే పెద్దవాడిని అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోవద్దని హితవు పలికారు. ఆకాశం మీద ఉమ్మేస్తే మీద పడుతుందని గుర్తించాలన్నారు. ప్రధాని మోదీ స్థాయి ఆయనది కాదని... ప్రధాని గురించి మాట్లాడే అర్హత కూడా లేదని... జాగ్రత్తగా ఉండాలని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

More Telugu News