తీహార్​ జైల్లో 1,100కు పైగా సెల్​ ఫోన్లు.. ఖైదీల నుంచి స్వాధీనం!

1100 phones seized in last 15 months from prisoners in tihar jail
అది దేశంలోనే అత్యంత భద్రత ఉండే తీహార్ జైలు.. కరుడుగట్టిన నేరస్తులు, గ్యాంగ్ స్టర్లను ఉంచేది అక్కడే. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో అరెస్టయిన ప్రముఖ నేతలు, వీఐపీలనూ ఖైదు చేసేదీ అక్కడే. అంత భద్రత ఉన్నా.. ఖైదీలకు బయటి నుంచి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ చేరిపోతూనే ఉన్నాయి. జైలు సిబ్బంది అప్పుడప్పుడూ ఖైదీలను తనిఖీ చేసినప్పుడు అవి పట్టుబడుతున్నాయి. ఇలా గత 15 నెలల్లో ఏకంగా 1,100 సెల్ ఫోన్లను ఖైదీల నుంచి తీహార్ జైలు సిబ్బంది స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

‘ఖిచోరా’.. చిన్న సెల్ ఫోన్..
జైలులోపల పట్టుబడిన సెల్ ఫోన్లు చాలా చిన్న పరిమాణంలో ఉన్నాయని జైలు వర్గాలు తెలిపాయి. జైల్లోని గ్యాంగ్ స్టర్ ఖైదీలు వాటిని ‘ఖిచోరా’ అని పిలుచుకుంటారని వెల్లడించాయి. అంతేకాదు ఖైదీలను తనిఖీ చేసినప్పుడు కొన్ని పెన్ డ్రైవ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా దొరికాయని.. జైలు లోపలి సమాచారాన్ని బయటికి పంపేందుకు వాటిని వినియోగిస్తున్నట్టు తేలిందని తెలిపాయి.

లోపలికి ఎలా తెస్తున్నారు?
జైల్లోకి వస్తున్న ఖైదీలు సెల్ ఫోన్లు, ఇతర నిషేధిత వస్తువులను తమ శరీరం లోపల దాచుకుని తెస్తున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. బాడీ స్కానర్లకు దొరక్కుండా వాటికి కార్బన్ రేపర్లు చుట్టి.. నోటి ద్వారా మింగి తీసుకువస్తున్నారని వివరిస్తున్నారు. ఇక ఖైదీల కోసం తెచ్చే ఆహారం, దుస్తుల వంటి వాటిలోనూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తెస్తున్నారని అంటున్నారు.

ఇలాంటి వాటిని నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తీహార్ జైలు డీజీ సంజయ్ బెనివాల్ వెల్లడించారు. ఖైదీలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలేవీ వాడకుండా.. పూర్తిస్థాయిలో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని వివరించారు.
Go Back to Shorts
Tihar Jail
mobile phones
prisoners
jail
national news

More Telugu News