Moosapet: హైదరాబాద్ లో చిత్తు కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం

  • తీవ్ర రక్తస్రావంతో మరణించిన మహిళ
  • ఆదివారం తెల్లవారుజామున ఘటన
  • బైక్ పై పారిపోయిన ఇద్దరు యువకులు
Women Raped by Two Youngsters In Moosapet

హైదరాబాద్ లోని మూసాపేటలో ఆదివారం తెల్లవారుజామున ఘోరం చోటుచేసుకుంది. చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళపై ఇద్దరు యువకులు అమానుషంగా అత్యాచారం చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు కన్నుమూసింది. తెల్లవారాక మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. బాధితురాలితో ఇద్దరు యువకులు మాట్లాడటం కనిపించింది. దారుణానికి పాల్పడ్డ తర్వాత వారిద్దరూ బైక్ పై కూకట్ పల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. 

పోలీసుల వివరాల ప్రకారం..
మూసాపేట వై జంక్షన్ సమీపంలోని వ్యాపార సముదాయాల వద్ద ఆదివారం ఉదయం ఓ మహిళ మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే ఓ సంచీ, అందులో చిత్తుకాగితాలు ఉన్నాయి. డెడ్ బాడీపై దుస్తులు అస్తవ్యస్తంగా ఉండడం, రక్తస్రావం జరగడంతో బాధితురాలు అత్యాచారానికి గురైందని గుర్తించారు. ఘటనా స్థలానికి దగ్గర్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా.. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో బాధితురాలితో ఇద్దరు యువకులు మాట్లాడడం కనిపించింది.

ఆపై వారు ఆమెను విష్ణుప్రియ లాడ్జి పక్కనే ఉన్న సందులోకి బలవంతంగా లాక్కెళ్లడం, కాసేపటి తర్వాత యువకులు ఇద్దరూ బైక్ పై కూకట్ పల్లి వైపు వెళ్లడం రికార్డైందని పోలీసులు తెలిపారు. వేలిముద్రల నిపుణులు, జాగిలాల బృందం సభ్యులు పలు ఆధారాలను సేకరించినట్లు కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, సీఐ కృష్ణమోహన్‌లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.

More Telugu News