YS Sharmila: చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా, అప్పుగా ఇచ్చినట్టు చూపించారు: షర్మిల

  • నిన్న నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల
  • అఫిడవిట్లో ఆసక్తికర అంశాలు
  • జగన్ నుంచి రూ.82 కోట్లు, భారతీరెడ్డి నుంచి రూ.19 లక్షలు అప్పుతీసుకున్నట్టు వెల్లడి
  • ఆసక్తికరంగా వివరణ ఇచ్చిన షర్మిల
Sharmila clarifies on her debts mentioned in affidavit

ఏపీ కాంగ్రెస్ చీఫ్ కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తూ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. షర్మిల తన సోదరుడు జగన్ నుంచి రూ.82 కోట్లు, వదిన భారతీరెడ్డి నుంచి రూ.19 లక్షలు అప్పు తీసుకున్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంత పెద్ద మొత్తంలో, అది కూడా అన్న నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం షర్మిలకు ఏమొచ్చింది అంటూ దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో, అసలు విషయం ఏమిటో షర్మిల వెల్లడించారు. "నేను అఫిడవిట్ లో పేర్కొన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి గారు నాకు అప్పు ఇచ్చారు అనే విషయం మీడియాలో వస్తోంది. సమాజంలో ఏ అన్న అయినా తన చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చేయాలి. అది ఆ ఆడబిడ్డ హక్కు. ఆస్తిని ఇచ్చేయాల్సిన బాధ్యత అన్నకు ఉంటుంది. 

మేనమామగా కూడా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తల్లి తర్వాత తల్లిలా మేనమామ ఉండాలి. సహజంగా ఇది అందరూ పాటించే నియమమే. 

కానీ కొందరు మాత్రం చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి, తామేదో ఆ ఆస్తిని చెల్లెలికి గిఫ్టుగా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తుంటారు. ఇంకొందరైతే చెల్లెలి వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా, దాంట్లో ఒక కొసరు చెల్లెలికి ఇచ్చి, అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించేవారు ఉన్నారు. ఇది వాస్తవం... ఇది దేవుడికి తెలుసు... ఇది మా కుటుంబం అంతటికీ తెలుసు" అని షర్మిల వివరించారు.

More Telugu News