Lok Sabha Polls: సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఎఫెక్ట్.. ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లకు భారీ డిమాండ్‌

  • గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ ఏడాది వీటి డిమాండ్‌ 40 శాతం పెరిగే అవకాశం 
  • డిమాండ్‌కు స‌రిప‌డా లేని చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లు 
  • విమాన ఛార్జీ గంటకు రూ. 4.5 లక్షల నుంచి రూ.5.25 ల‌క్ష‌ల‌ వరకు
  • ఈసారి హెలికాప్టర్లకు గరిష్ఠంగా గంటకు రూ.3.50 లక్షల వరకు ప‌లికే అవ‌కాశం 
  • వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల వ్య‌యం మొత్తం రూ. 1.20 లక్షల కోట్లు ఉండొచ్చ‌ని అంచ‌నా
Demand for private jets and helicopters likely to rise 40 during Lok Sabha polls

త్వరలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మెుదలైంది. ప్ర‌ధాన‌ రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక‌ రాజకీయ నేతల ప్రచారాలు మరింత ఊపందుకుంటున్న త‌రుణంలో ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ ఏడాది వీటి డిమాండ్‌ 40 శాతం పెరిగే అవకాశం ఉంద‌ని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఫిక్స్‌డ్‌-వింగ్‌ విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకు అధిక డిమాండ్‌ ఉండే అవకాశం ఉందని విశ్లేష‌కులు చెబుతున్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం సులభంగా చేరుకునే అవకాశం ఉండటం వల్లే హెలికాప్టర్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

"ప్రైవేట్ జెట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్ర‌స్తుతం డిమాండ్‌కు స‌రిప‌డా చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ల లేవు. చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ల సరఫరా పరిమితంగా ఉంది" అని క్లబ్‌ వన్‌ ఎయిర్‌ సీఈఓ రంజన్ మెహ్రా తెలిపారు. 

ఇక అధిక డిమాండ్‌ నేపథ్యంలో కొంతమంది వీటిని లీజుకు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు. కాగా, ఛార్టర్డ్‌ విమానాలు, హెలికాప్టర్‌ సేవలకు ఛార్జీలను గంటల లెక్కన వసూలు చేయ‌డం జ‌రు‌గుతుంది. విమాన ఛార్జీ గంటకు రూ. 4.5 లక్షల నుంచి రూ.5.25ల‌క్ష‌ల‌ వరకు ఉంటుందని ప‌రిశ్ర‌మ నిపుణులు తెలిపారు. అదే హెలికాప్టర్ విష‌యానికి వ‌స్తే గంటకు రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు వెల్లడించాయి.

బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏఓఏ) మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ ఆర్‌కే బాలీ పీటీఐతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లకు గత ఎన్నికలతో పోలిస్తే 30 నుండి 40 శాతం డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు.

మ‌రోవైపు 2023 డిసెంబరు నాటికి దేశంలో 112 నాన్‌-షెడ్యూల్డ్‌ ఆపరేటర్లు (ఎన్ఎస్ఓ) ఉన్నాయ‌ని స‌మాచారం. ఇక‌ ఈ కంపెనీలు అవసరాన్ని బట్టి విమాన స‌ర్వీసులు అందిస్తుంటాయి. ఈ సంస్థల దగ్గర దాదాపు 350 విమానాలు, 175 వరకు హెలికాప్టర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా వరకు 10 కంటే తక్కువ సీటింగ్‌ సామర్థ్యం ఉన్నవేనని తెలుస్తోంది.

కాగా, ఈ పరిశ్రమలో మధ్యవర్తులు కూడా ఉంటారని నిపుణులు తెలిపారు. వారు ముందుగానే కొన్ని గంటల సేవలను బుక్‌ చేసుకొని తిరిగి వాటిని డిమాండ్‌ను బట్టి కస్టమర్లకు విక్రయిస్తారట‌. ఈసారి గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్లకు గరిష్ఠంగా గంటకు రూ.3.50 లక్షల వరకు చెల్లించడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల స‌మాచారం.

అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్‌ అకౌంట్లలో హెలికాప్టర్లు లేదా విమానాల సేవలకు దాదాపు రూ.250 కోట్ల వరకు చెల్లించినట్లు అధికార బీజేపీ తెలిపింది. అటు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార ప్రయాణ వ్య‌యం కింద ఆ ఏడాది రూ. 126 కోట్లుగా లెక్క చూపింది.

వెటరన్ ఎలక్షన్ ఎనలిస్ట్ ఎన్ భాస్కరరావు ప్రకారం, వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మొత్తం ఖర్చు దాదాపు రూ. 1.20 లక్షల కోట్లు ఉండొచ్చ‌ని అంచ‌నా. "2024 లోక్‌సభ ఎన్నికల వ్యయం ఒక్కటే దాదాపు లక్షా ఇరవై వేల కోట్లు ఉంటుంద‌ని, భారత ఎన్నికల సంఘం దాదాపు ఇరవై శాతం ఖర్చు చేస్తుందని అంచనా వేయబడింది (కొత్త ఈవీఎంలపై ఖర్చు చేర్చబడలేదు)" అని ఆయన చెప్పారు. ఇక మహమ్మారి కారణంగా చార్టర్డ్ విమానాల‌ అద్దె ధర దాదాపు స్థిరంగానే ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇక మహమ్మారి కారణంగా చార్టర్డ్ విమానాల‌ అద్దె ధర దాదాపు స్థిరంగానే ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

More Telugu News