Kalalaku Rekkalu: ఆడబిడ్డల కోసం 'కలలకు రెక్కలు' కార్యక్రమం అమలు చేయబోతున్నాం: చంద్రబాబు

  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో కొత్త పథకం తెచ్చామని వెల్లడి
Chandrababu Naidu explains about Kalalaku Rekkalu scheme

నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం అని పేర్కొన్నారు. అందుకే మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు నిరంతరం పని చేసింది తెలుగుదేశం అని వివరించారు. విద్య, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపింది తెలుగుదేశం అని పేర్కొన్నారు. 

"నేడు మళ్లీ మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు హామీ ఇచ్చిందే మహాశక్తి పథకం. ఈ పథకం  కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1,500ల ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అందిస్తాం.

అలాగే ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా మన ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదు అన్న ఆశయంతో, 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని మన ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోతున్నాం. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. అంతేకాకుండా కోర్సు కాలానికి ఋణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. 'కలలకు రెక్కలు' పథకంలో మీ పేరును ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు. అందుకోసం kalalakurekkalu.com వెబ్ సైట్ కు వెళ్లండి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

More Telugu News