Sadhvi Pragna Thakur: నన్ను క్షమించబోనని మోదీ అన్నారు: బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్

BJP MP Sadhvi Pragna Thakur on being denied ticket in lok sabha elections
  • లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంపై భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ స్పందన 
  • గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ప్రధానికి నచ్చలేదని వెల్లడి
  • తనను క్షమించనని ప్రధాని అప్పట్లో అన్నట్టు గుర్తుచేసిన ఎంపీ
  • తాను ఏనాడూ టిక్కెట్ కోరుకోలేదని వ్యాఖ్య, పార్టీలోనే ఉంటానని స్పష్టీకరణ
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తనకు టిక్కెట్ కేటాయించకపోవడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తాజాగా స్పందించారు.  గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మోదీ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తనను క్షమించేది లేదని మోదీ గతంలోనే చెప్పారని వ్యాఖ్యానించారు. ‘‘గతంలోనూ నేను టిక్కెట్ ఆశించలేదు. ఇప్పుడూ టిక్కెట్ కోరుకోవట్లేదు. గతంలో నేను చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీకి నచ్చకపోయి ఉండొచ్చు. నన్ను క్షమించేది లేదని అప్పుడే అన్నారు. అయితే, నేను అప్పట్లో ప్రధానికి క్షమాపణలు చెప్పాను. నేను పార్టీలోనే కొనసాగుతా. నాకిచ్చిన బాధ్యతలను నిర్వహిస్తాను’’ అని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని తాను శిరసావహిస్తానని చెప్పారు. 

ప్రస్తుతం భోపాల్ ఎంపీగా ఉన్న ప్రజ్ఞకు బీజేపీ పార్టీ ఈసారి టిక్కెట్ కేటాయించలేదు. తొలి దశలో పార్టీ ప్రకటించిన 195 మంది అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. భోపాల్‌లో పార్టీ తరపున ఈసారి ప్రజ్ఞకు బదులు మాజీ మేయర్ అలోక్ శర్మను బీజేపీ బరిలోకి దింపింది. 

ప్రజ్ఞా ఠాకూర్ మాలేగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, 2019లో నాథూరామ్ గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ ప్రజ్ఞ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై మోదీ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని అవమానించిన వారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు.
Sadhvi Pragna Thakur
Bhopal
BJP
Narendra Modi
Lok Sabha Polls

More Telugu News