rani rudrama reddy: అయ్యా గుంపు మేస్త్రీ గారూ... మొదట ఈ పుస్తకం చదవండి: రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకురాలు రాణి రుద్రమరెడ్డి సలహా

  • బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పడానికి మేం తీసుకువచ్చిన పుస్తకం చదవాలంటూ సూచన
  • పుస్తకంలో అన్ని లెక్కలూ ఉన్నాయి... కొత్తగా ఏం లెక్కలు కావాలని ప్రశ్న
  • కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్
Rani Rudrama Reddy calls cm Revanth Reddy as Gumpu Mesthri

మన గుంపు మేస్త్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని సవాల్ చేస్తున్నారని, కానీ తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెబుతూ ఓ పుస్తకాన్ని విడుదల చేశామని... అది చదివితే తెలుస్తుందని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలో బీజేపీ విజయభేరీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'అయ్యా! గుంపు మేస్త్రీ గారూ... మీకు మేం ఒక్కటే చెప్పదలుచుకున్నాం... మీరే చెప్పారు.. ముఖ్యమంత్రి పదవి అంటే గుంపు మేస్త్రీ అని... గుంపు మేస్త్రీ అంటే ఇసుక, సిమెంట్, నలుగురు తాపీ మేస్త్రీలను, నలుగురు కూలీ అక్కతమ్ముళ్లను, అన్నదమ్ములను తీసుకు రావాలి... ఇల్లు కట్టాలి... రంగు వేయాలి... నీళ్లు కొట్టాలి... కప్పు వేయాలి... ఇలా ఆరు నెలలకో... ఏడాదికో ఇల్లు పూర్తవుతుంది... అప్పుడు నీవు చక్కటి గుంపు మేస్త్రీవి అవుతావు' అని ఎద్దేవా చేశారు. నీవు చేయాల్సింది అదీ... అంతేకానీ బీజేపీ ఏం చేసింది అంటూ సవాల్ చేస్తూ కూర్చుంటే మీ ముఖ్యమంత్రి పదవికి అలా అడగడం సరైంది కాదన్నారు.

గుంపు మేస్త్రీ కోసం తాను 314 పేజీల పుస్తకాన్ని బీజేపీ తరఫున కొరియర్ చేస్తానని... రేవంత్ రెడ్డికి చదువు వస్తే... ఓపిక ఉంటే దీనిని చదవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో పూర్తి లెక్కలతో సహా పుస్తకాలు తీసుకు వచ్చామన్నారు. ఈ పుస్తకంలో ఆ లెక్కలు ఉన్నాయి... కొత్తగా ఇక ఏం లెక్కలు కావాలని ప్రశ్నించారు. పుస్తకంలో అన్నీ వివరించాక అసెంబ్లీ సమావేశాలు వృథా చేయడానికి మళ్లీ లెక్కలు చెప్పాలా? అని నిలదీశారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి నిజాయతీ ఉంటే ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా ఒక్కో మహిళ ఖాతాలో నెలకు రూ.2,500 వేస్తామని చెప్పారని, కానీ వేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌వి అబద్ధాల గ్యారెంటీలు అన్నారు. అక్కాచెల్లెళ్ల కోసం నరేంద్ర మోదీ ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు... మహిళల ఆత్మగౌరవం కోసం ఉచితంగా బాత్రూంలు కట్టించారని తెలిపారు. రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పారని, కానీ ఇచ్చారా? అని నిలదీశారు. కానీ పీఎం కిసాన్ కింద రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్నామని, ఇది మోదీ గ్యారెంటీ అన్నారు.

More Telugu News