Harsha Kumar: వైఎస్ షర్మిలను జగనే కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చు: హర్షకుమార్

  • ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై జరిగిన దాడిపై జగన్ స్పందించాలన్న హర్షకుమార్
  • జడ్జిలకు రాజకీయ పదవులు ఇవ్వడం మంచిది కాదని వ్యాఖ్య
  • డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్నికల గిమ్మిక్కేనని విమర్శ
Jagan may sent Sharmila into Congress says Ex MP Harsha Kumar

అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ సిద్ధం సభ సమయంలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని మాజీ ఎంపీ హర్షకుమార్ ఖండించారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించాలని కోరారు. దాడిపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విన్నవించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకూడదని హర్ష కుమార్ అన్నారు. అలాగే ఎస్సీ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న నేతలను కాదని కొత్తవారికి సీట్లు ఇవ్వకూడదని చెప్పారు. జడ్జిలకు రాజకీయ పదవులు ఇవ్వడం మంచిది కాదని అన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా టికెట్లు ఇవ్వకూడదని చెప్పారు. ఏపీలో వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని... వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా దళితులు ఓట్లు వేయాలని సూచించారు. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలని అన్నారు. 

అమలాపురం నియోజకవర్గంలో సొంతంగా సర్వే చేయించుకుంటున్నామని... ప్రజల్లో ఆదరణ ఉన్నట్టు సర్వేలో తేలితే ఎన్నికల్లో పోటీ చేస్తామని హర్షకుమార్ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్నికల గిమ్మిక్కేనని విమర్శించారు. ఆర్కే వైసీపీ నుంచి వెళ్లిపోవడం, మళ్లీ వైసీపీలోకి రావడం కూడా జగన్ ప్లానే అని చెప్పారు. షర్మిలను జగనే కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

More Telugu News