EVM: ఈవీఎంలకు కూడా ఆపరేటింగ్  సిస్టమ్ (ఓఎస్) ఉంటుందా?... ఈ ప్రశ్నకు ఈసీ జవాబు ఇదిగో!

  • త్వరలో దేశంలో ఎన్నికలు
  • తన వెబ్ సైట్ లో FAQ ని అప్ డేట్ చేసిన ఈసీ
  • వివిధ సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నం
ECI updates FAQ on EVMs

భారతదేశంలో చాన్నాళ్లుగా ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. అయితే, ఈవీఎంల వినియోగంపై ఇప్పటికీ అనేక రాజకీయ పార్టీల్లో సందేహాలు ఉన్నాయి. ఎవరికి ఓటు వేసినా ఒకే పార్టీకి వెళ్లేలా అందులో మార్పులు చేయవచ్చేమో అనే అనుమానం పలు పార్టీలను పట్టి  పీడిస్తోంది. గతంలో అనేక మంది రాజకీయ నేతలు ఇలాంటి ఆరోపణలు చేశారు. 

ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు ఈవీఎంలపై ప్రశ్నలు-సమాధానాలను తన అధికారిక వెబ్ సైట్ లో FAQ విభాగంలో పొందుపరిచింది. 

ఇందులో... ఈవీఎంలకు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ఉంటుందా?... అన్నది ఓ ప్రశ్న. అందుకు ఈసీ సమాధానమిచ్చింది. ఈవీఎంలకు ఎలాంటి ఓఎస్ ఉండదని స్పష్టం చేసింది. ఈవీఎంలలో ఫర్మ్ వేర్ లేదా వన్ టైమ్ ప్రోగ్రామ్డ్ మెమరీతో కూడిన మెషీన్ లెవల్ ఇన్ స్ట్రక్షన్స్ ఉంటాయని వెల్లడించింది. 

ఈవీఎంలలోకి పార్టీల గుర్తులను ప్రత్యేకంగా రూపొందించిన సింబల్ లోడింగ్ అప్లికేషన్ ద్వారా ఎంటర్ చేస్తారని, ఈ ప్రక్రియ ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో చేపడతారని ఈసీ వివరించింది. 

ఇక, అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంల జోలికి వెళ్లకుండా, సాధారణ పద్ధతిలో ఎన్నికలు జరుపుకుంటుంటే, భారత్ ఎందుకు ఈవీఎంలు వినియోగిస్తోందన్న మరో ప్రశ్నకు కూడా ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది. 

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, నమీబియా, అర్జెంటీనా, భూటాన్ వంటి దేశాలు ఎన్నికల్లో డైరెక్ట్ రికార్డింగ్ మెషీన్లను వినియోగిస్తుంటాయని... ఈవీఎం కూడా ఒక రకమైన డైరెక్ట్ రికార్డింగ్ మెషీన్ అని వివరించింది.

More Telugu News