ఛత్తీస్ గఢ్ లో మావోల కాల్పులు... ముగ్గురు జవాన్ల మృతి

Maoists killed three jawans in Chhattisgarh
  • సుక్మా జిల్లా టేకులగూడలో ఎదురుకాల్పులు
  • పెట్రోలింగ్ విధుల్లో ఉన్న జవాన్లపై మావోల కాల్పులు
  • వెంటనే స్పందించి కాల్పులు జరిపిన జవాన్లు
  • అటవీప్రాంతంలోకి తప్పించుకున్న మావోలు
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. సుక్మా జిల్లా టేకులగూడలో ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో 14 మంది జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇక్కడికి 400 కిలోమీటర్ల దూరంలోని రాయ్ పూర్ కు తరలించారు. 

సుక్మా జిల్లాలో నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉండడంతో టేకులగూడ వద్ద భద్రతా బలగాలు స్థావరం ఏర్పాటు చేశాయి. తమ పరిధిలో పెట్రోలింగ్ చేస్తుండగా, జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా బెటాలియన్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్లు వెంటనే స్పందించి ఎదురు కాల్పులు జరిపారు. దాంతో నక్సల్స్ అక్కడ్నించి తప్పించుకుని అటవీప్రాంతంలోకి వెళ్లిపోయారు. 

టేకులగూడ ప్రాంతం అటవీమయం కాగా, ఇక్కడ నక్సల్స్ కు బాగా పట్టుందని భావిస్తారు. 2021లో ఇక్కడ జరిగిన కాల్పుల ఘటనలో 22 మంది జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలోనే టేకులగూడ వద్ద భద్రతా బలగాలు క్యాంపును ఏర్పాటు చేశాయి.
Go Back to Shorts
Chhattisgarh
Jawans
Maoists
Sukma District

More Telugu News