Bonda Uma: పొత్తులో జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ కల్యాణ్ ప్రకటించారు: బొండా ఉమ

  • నేడు రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించిన పవన్ కల్యాణ్
  • చంద్రబాబుపై ఆగ్రహంతోనే పవన్ రెండు సీట్లను ప్రకటించారన్న వైసీపీ
  • ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడిలా మీకేంటి సంబంధం అంటూ బొండా ఉమ ఫైర్
  • టీడీపీ-జనసేన కూటమిని చూసి ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా 
Bonda Uma clarifies Pawan Kalyan announcement for two constituencies

ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ రాజోలు, రాజానగరం సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి, ఉమ్మడిగా జాబితాలు ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే, మండపేట సభలో చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించారని, ఆయన రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో తాము కూడా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామని నేడు పవన్ పేర్కొన్నారు. 

అయితే, వైసీపీ స్పందిస్తూ... టీడీపీ వైఖరిపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో పేర్కొంది. పొత్తుధర్మం పాటించడంలేదని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పోస్టు చేసింది. 

ఈ పరిణామాలన్నింటిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యు బొండా ఉమ స్పందించారు. పొత్తులో జనసేనకు కేటాయించిన సీట్లనే నేడు పవన్ కల్యాణ్ ప్రకటించారని వెల్లడించారు. మరి వైసీపీ ఎందుకు భయపడుతుందో అర్థం కావడంలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. 

మేం కూడా ఓ అభ్యర్థిని ప్రకటించాం, పవన్ కల్యాణ్ కూడా వారికి కేటాయించిన సీట్లకు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించుకున్నారు... ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడిలా మీకేంటి సంబంధం? అంటూ బొండా ఉమ వైసీపీపై మండిపడ్డారు. 

దీన్నిబట్టి అర్థమవుతోంది ఏంటంటే... టీడీపీ-జనసేన కూటమి అంటే మీకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి... మీరు డైపర్లు వేసుకుని తిరుగుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ-జనసేన కూటమిని విడగొట్టడానికి తాడేపల్లిలో జే-గ్యాంగ్ మొత్తం గోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నారని బొండా ఉమ వ్యాఖ్యానించారు.

More Telugu News