Medico Dead body: సూర్యారావుపేట బీచ్ లో మెడికో మృతదేహం.. హత్యా? ఆత్మహత్యా?

Ranagaraya College medico dead body found at NTR beach in Kakinada
  • సముద్రంలో నుంచి కొట్టుకువచ్చిన డెడ్ బాడీ
  • కాకినాడ జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన
  • ఐడీ కార్డు ఆధారంగా మెడికో శ్వేతగా గుర్తించిన పోలీసులు

కాకినాడ జిల్లా సూర్యారావుపేట బీచ్ లో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. సముద్రం నుంచి డెడ్ బాడీ ఒడ్డుకు కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా మృతురాలు రంగరాయ మెడికల్ కాలేజీ విద్యార్థిని శ్వేతగా గుర్తించారు. అయితే, యువతిది ఆత్మహత్యనా? లేక ఎవరైనా ఆమెను హత్య చేసి సముద్రంలో పడేశారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

సూర్యనారాయణపురం రంగయ్యనాయుడు వీధికి చెందిన వంకధరి శ్వేత కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోందని పోలీసులు తెలిపారు. ప్రతిరోజూ ఇంటి నుంచే కాలేజీకి వెళ్లి వస్తోందని, బుధవారం ప్రాక్టికల్ క్లాసులు ఉండడంతో ఉదయం తాను కాలేజీ వద్ద డ్రాప్ చేశానని శ్వేత తండ్రి కుబేరరావు చెప్పారు. సాయంత్రం కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు. ఉదయం కాలేజీకి వెళ్లిన కూతురు సాయంత్రానికి చనిపోయిందని తెలిసి ఆ తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇంకో ఏడాది పూర్తయితే డాక్టర్ అవుతుందని అనుకున్న కూతురు బీచ్ లో శవమై కనిపించడం చూసి శ్వేత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • Loading...

More Telugu News