Raj Nath Singh: కేంద్రం గుడ్‌న్యూస్... మెహిదీపట్నం స్కైవాక్ కోసం స్థలాన్ని అప్పగించనున్న రక్షణ శాఖ

  • రక్షణ శాఖకు చెందిన 3,380 చ.గ. స్థలాన్ని స్కైవాక్ కోసం ఇవ్వనున్న రక్షణ శాఖ
  • నాలుగు వారాల్లోగా తెలంగాణ ప్రభుత్వానికి అంగీకరించనున్న కేంద్రం
  • ప్రతిగా పదేళ్ల పాటు లైసెన్స్ ఫీజుతో పాటు రక్షణ శాఖకు రూ.15.15 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాలని షరతు
Centre to hand over 3380 sq yards land for Mehdipatnam skywalk

మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణం కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ బుధవారం అంగీకరించింది. మెహదీపట్నంలో రక్షణ శాఖకు చెందిన 3,380 చదరపు గజాల స్థలాన్ని నాలుగు వారాల్లోగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఓకే చెప్పింది. ఇక్కడ స్కైవాక్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు అవసరమయ్యాయి. ఇక ఈ భూములు ఇచ్చినందుకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల పాటు లైసెన్స్ ఫీజుతో పాటు రక్షణ శాఖకు రూ.15.15 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాలని షరతు విధించింది.

మెహదీపట్నంలో రోడ్డు దాటేందుకు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో స్కైవాక్ నిర్మించాలని నిర్ణయించింది. అయిదేళ్ల క్రితం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ స్కైవాక్‌ని ప్రతిపాదించగా.. మూడేళ్ల క్రితం రూ.34.28 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. కానీ తమ భూముల్లో పనులు చేస్తున్నారని రక్షణ శాఖ అడ్డుకుంది. దీంతో అప్పుడు పనులు ఆగిపోయాయి. ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలపడంతో ముందుకు సాగనున్నాయి.

ఈ స్కైవాక్ పాదచారుల మార్గంగా మాత్రమే కాకుండా సందర్శకులకు అదనపు సౌకర్యాలను కూడా అందిస్తుంది. స్కైవాక్‌లో 21,061.42 చదరపు అడుగుల వాణిజ్య స్థలం ఉంది. దీనిని కాఫీ షాప్‌లు, గేట్ వే కార్నర్స్, స్నాక్ లాంజ్‌ల ఏర్పాటు కోసం వినియోగిస్తారు. స్కైవాక్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేకి ఆనుకొని ఒకవైపు రక్షణ శాఖ భూమి, మరోవైపు వాణిజ్య భవనాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రక్షణ శాఖ భూముల కోసం లేఖలు రాశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి రక్షణ శాఖ భూమి కోసం విజ్ఞప్తి చేశారు.

More Telugu News