పతంగి మాంజా మెడకు చుట్టుకుని హైదరాబాద్ లో సైనికుడి మృతి

Soldier died after Manja slits his throat
  • సంక్రాంతి సీజన్ లో పతంగులు ఎగురవేత
  • లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై వెళుతుండగా మెడకు చుట్టుకున్న మాంజా
  • సైనికుడు కోటేశ్వర రెడ్డి మెడకు తీవ్రగాయం
  • అధిక రక్తస్రావంతో మృతి
హైదరాబాదులో ఓ సైనికుడు పతంగి మాంజా మెడకు చుట్టుకుని దుర్మరణం పాలయ్యాడు. కాగితాల కోటేశ్వర రెడ్డి (30) భారత సైన్యంలో నాయక్ హోదాలో పనిచేస్తున్నాడు. కోటేశ్వర రెడ్డి స్వస్థలం ఏపీలోని పెదవాల్తేరు. 

ఆయన హైదరాబాదులో లంగర్ హౌస్ సమీపంలో ఓ ఫ్లైఓవర్ మీద ద్విచక్రవాహనంపై వెళుతుండగా... గాలిపటానికి కట్టిన చైనా మాంజా మెడకు చుట్టుకుని గొంతుకు తీవ్రగాయమైంది. ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

సంక్రాంతి సీజన్ లో హైదరాబాదులో పతంగులు ఎగురవేస్తూ నగరజీవులు ఉల్లాసంగా కనిపిస్తుంటారు. అయితే, పతంగులకు కట్టే మాంజాల విషయంలో చాలాకాలంగా అభ్యంతరాలు ఉన్నాయి. ఇతరుల పతంగులను తమ పతంగులతో కట్ చేయడం కోసం ప్రత్యేకమైన మాంజాలు వాడుతుంటారు. వీటిలో చైనా మాంజాలు చాలా ప్రమాదకరమని నిపుణులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. ఈ మాంజాలకు గాజు ముక్కల పొడిని అద్దుతారు. దాంతో ఇతర పతంగుల దారాలను సులభంగా కట్ చేసే వీలుంటుంది.

ఈ మాంజాలు పక్షుల పాలిట కూడా ప్రాణాంతకం అని చాలాసార్లు నిరూపితమైంది. పక్షుల కాలికి ఈ మాంజాలు చుట్టుకుంటే ఆ కాలు అంతటితో తెగిపోవాల్సిందే. మెడకు చుట్టుకుంటే ఇక చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో, 2016లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఈ మాంజాలపై నిషేధం విధించింది. అయినప్పటికీ అమ్మకాలు సాగుతున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Chinese Manja
Soldier
Death
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News