Chandrababu: మార్కాపురం జిల్లా కావాలనే మీ కోరిక తీరుస్తాం: చంద్రబాబు

  • కనిగిరిలో రా కదలి రా సభ
  • హాజరైన చంద్రబాబు
  • తన ప్రసంగంలో స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ అధినేత
  • ప్రకాశం జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై సిట్ వేస్తామని వెల్లడి
Chandrababu gives assurance on proposed Markapur district

టీడీపీ అధినేత చంద్రబాబు కనిగిరిలో రా కదలి రా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ స్థానిక అంశాలను కూడా ప్రస్తావించారు. టీడీపీ అధికారంలోకి వస్తే... మార్కాపురం జిల్లా కావాలనే ఈ ప్రాంత ప్రజల కోరిక తీరుస్తామని హామీ ఇచ్చారు. కనిగిరికి ట్రిపుల్ ఐటీ తీసుకువచ్చే బాధ్యత నాది అని ప్రకటించారు. 

నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు తీసుకెళ్లి గోదావరి నీరు ఇస్తామని పేర్కొన్నారు. 

"ఈ ప్రభుత్వం ఒంగోలు, మార్కాపురం, కనిగిరిలో టిడ్కో ఇళ్లు పూర్తి చేయలేకపోయింది... టిడ్కో ఇళ్లు ప్రజల సంపద... వాటిని మీకు అప్పగించే బాధ్యత మాది. ప్రకాశం జిల్లాకు ఆక్వా, గ్రానైట్, ఫార్మా పరిశ్రమలు తీసుకువస్తాం. ప్రకాశం జిల్లా యువతకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తాం. ప్రభుత్వం తీసుకువచ్చిన భూరక్ష చట్టం చాలా ప్రమాదకరమైనది. మేం అధికారంలోకి వచ్చాక భూరక్ష చట్టం రద్దు చేస్తాం. ప్రకాశం జిల్లాలో జరిగిన కుంభకోణాలపై సిట్ వేస్తాం" అని చంద్రబాబు వివరించారు.

More Telugu News