Revanth Reddy: హైదరాబాద్ అంటే చార్మినార్.. ట్యాంక్‌బండ్... నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తాయి: రేవంత్ రెడ్డి

  • నుమాయిష్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • నుమాయిష్ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తామని హామీ
  • పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని హామీ
CM Revanth Reddy inaugurates Nampally Exhibition

హైదరాబాద్ అంటే చార్మినార్... ట్యాంక్‌బండ్... నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి గ్రౌండ్స్‌లో సీఎం నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నుమాయిష్‌లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలు పాల్గొంటారని తెలిపారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ఇక్కడి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారని, ఇది అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి తోడ్పాటును అందిస్తామన్నారు. ఎగ్జిబిషన్ కమిటీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.

కొన్నేళ్లుగా పలువురు పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, వివిధ సంస్థలు కలిసి నుమాయిష్‌ను విజయవంతంగా.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నుమాయిష్ తెలంగాణకే గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యాసంస్థల్లో 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలిపారు. దశాబ్దాలుగా ఎంతోమంది వ్యాపారవేత్తలను తయారు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారని... రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పులు తీసుకు వస్తామన్నారు.

More Telugu News