Natti Kumar: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నా.. సినీ నిర్మాత నట్టి కుమార్

  • తొలుత తాను వైసీపీ సానుభూతిపరుడినేనన్న నట్టికుమార్
  • ఉత్తరాంధ్రను మోసం చేసేందుకే రాజధాని డ్రామాలు అంటూ విమర్శలు
  • చంద్రబాబు ఆలోచనకు పవన్ తోడవడంతో జగన్‌ దండయాత్రలు మొదలుపెట్టారన్న నిర్మాత
Tollywood Producer Natti Kumar Says Will Join In TDP

తాను త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. చోడవరంలోని పూర్ణా థియేటర్‌లో నిన్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత తాను వైసీపీ సానుభూతిపరుడినేనని, అయితే, జగన్ తీసుకున్న నిర్ణయాలతో విసిగిపోయానని తెలిపారు. జగన్ మొత్తం రెడ్డి కులపాలన చేశారని విమర్శించారు.

ఉత్తరాంధ్రను మోసం చేసేందుకే జగన్ రాజధాని పేరుతో నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు కూడా గుర్తించారన్నారు. త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు చెప్పిన ఆయన తమలాంటి వాళ్లను వైసీపీ తన స్వార్థానికి ఉపయోగించుకుందని విమర్శించారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ రూ. 2 కోట్ల విలువైన చర్చి ఆస్తులను ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

విశాఖపట్టణానికి కోట్లాది రూపాయల విలువైన పరిశ్రమలు వచ్చినట్టు మంత్రి అమర్ నాథ్ చెబుతున్నారని, ఎక్కడ, ఎన్ని ఏమేమి పరిశ్రమలు వచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆలోచనకు పవన్ కల్యాణ్ కూడా తోడు కావడంతో జగన్‌కు ఏం చేయాలో తెలియక దండయాత్రలు చేయిస్తున్నారని నట్టి కుమార్ విమర్శించారు.

More Telugu News