ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ కోరిందని నిర్ధారించిన పాకిస్థాన్

Pakistan confirms India wanted Hafiz Saeed
  • మనీల్యాండరింగ్ కేసులో విచారణకు అప్పగించాలంటూ విజ్ఞప్తి అందిందన్న పాక్‌  
  • నేరస్థుల అప్పగింతకు ఇరుదేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందం లేదని వెల్లడి  
  • పాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జహ్రా బలోచ్‌ కీలక ప్రకటన
2008 నాటి భయానక ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్‌ అభ్యర్థించిందని పాకిస్థాన్‌ నిర్ధారించింది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జహ్రా బలోచ్‌ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మనీలాండరింగ్ కేసులో హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత అధికారుల నుంచి విజ్ఞప్తి వచ్చిందని తెలిపారు. అయితే నేరస్థుల అప్పగింతకు సంబంధించి భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు లేవని ఆమె ప్రస్తావించారు. 

ఇక హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్ కోరడం నిజమేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం నిర్ధారించిన విషయం తెలిసిందే. ఒక కేసులో విచారణ కోసం హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని అభ్యర్థించినట్టు చెప్పారు. కాగా హఫీజ్ సయీద్ భారత్‌లో అనేక కేసులలో వాంటెడ్‌గా ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో కూడా అతడి పేరు ఉందన్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Hafiz Saeed
Hafiz Saeedextradition
India
Pakistan

More Telugu News