Revanth Reddy: మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయింది: నాగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి

  • ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్న రేవంత్ రెడ్డి
  • జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో గెలిచామన్న తెలంగాణ సీఎం
  • భారత్ న్యాయ్ యాత్ర తర్వాత మోదీ ఇంజిన్ ఆగిపోతుందని జోస్యం
Telangana Chief Minister Revanth Reddy Speech At Nagpur

దేశంలో మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా గురువారం నాగపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మహారాష్ట్రలోనూ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

రాహుల్ గాంధీ త్వరలో భారత్ న్యాయ్ యాత్ర చేయనున్నారని తెలిపారు. బీజేపీ నిత్యం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటోందని... డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అని ఎద్దేవా చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీ గొంతెత్తడంతో అదానీ ఇంజిన్ ఆగిపోయిందని... ఇప్పుడు రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర తర్వాత మోదీ ఇంజిన్ కూడా ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా వంద రోజుల పాటు దేశం కోసం... కాంగ్రెస్ కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News