Latha Rajinikanth: రజనీకాంత్ అర్ధాంగి లతకు బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక కోర్టు

  • గతంలో కొచ్చాడయాన్ సినిమా తెరకెక్కించిన రజనీ కుమార్తె ఐశ్వర్య
  • ఈ సినిమా కోసం భారీగా అప్పు తీసుకున్న చిత్ర నిర్మాణ సంస్థ
  • రుణానికి హామీదారుగా నిలిచిన లతా రజనీకాంత్
  • నిర్మాత అప్పు తీర్చకపోవడంతో లతా రజనీకాంత్ కు సమస్యలు
  • నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు... బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లత
Bengaluru court grants bail to Latha Rajinikanth

తలైవా రజనీకాంత్ అర్ధాంగి లతకు బెంగళూరులోని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఓ భారీ రుణం విషయంలో లత హామీదారుగా ఉండడంతో, రుణం ఇచ్చిన యాడ్ ఏజెన్సీ న్యాయపోరాటం చేస్తోంది. 

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... గతంలో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ 'కొచ్చాడయాన్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించారు. ఈ క్రమంలో సదరు చిత్ర నిర్మాణ సంస్థ మీడియా వన్ ఎంటర్టయిన్ మెంట్ లో పనిచేసే మురళి అనే వ్యక్తికి చెన్నైలోని యాడ్ బ్యూరో అడ్వర్టయిజింగ్ సంస్థ రూ.6.2 కోట్లు అప్పుగా ఇచ్చింది. ఈ రుణానికి మురళి తరఫున రజనీకాంత్ అర్ధాంగి లత హామీదారుగా సంతకం చేశారు. 

అయితే, మురళి ఈ అప్పు తీర్చకపోవడంతో, మధ్యలో హామీదారుగా ఉన్న లత చిక్కుకుపోయారు. గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం బెంగళూరు కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో, లతపై బెంగళూరు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాంతో ఆమె స్వయంగా కోర్టుకు హాజరై, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు... షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా లత రజనీకాంత్ రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తు, మరో రూ.25 వేల నగదు కోర్టుకు చెల్లించారు.

More Telugu News