Nara Lokesh: వాళ్లిద్దరిని చూస్తే జగన్ కు భయం: నారా లోకేశ్

  • పోలిపల్లిలో  యువగళం నవశకం సభ
  • హాజరైన నారా లోకేశ్
  • జగన్ కు ఉక్కపోత మొదలైంది అంటూ వ్యాఖ్యలు
Nara Lokesh take a jibe at CM Jagan

టీడీపీ అగ్రనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ పోలిపల్లిలో ఏర్పాటు చేసిన యువగళం నవశకం సభలో ప్రసంగించారు. ఒక పక్క యువగళం... మరో పక్క చంద్రబాబు గారి భవిష్యత్తుకి గ్యారెంటీ... ఇంకోవైపు పవనన్న వారాహి యాత్రతో జగన్ కి, ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవనన్న అంటే జగన్ కి భయం అని అన్నారు. మీ లోకేశ్ ని చూసినా జగన్ కు భయమేనని వ్యాఖ్యానించారు. 

"విజనరీ అంటే చంద్రబాబు... ప్రిజనరీ అంటే జగన్... ఇది ఫిక్స్. జగన్ అరెస్ట్ అయితే రోజుకో స్కామ్ బ‌యటపడింది... చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే 15 ఏళ్లు సీఎంగా ఆయన  చేసిన అభివృద్ధి, సంక్షేమం బయటకు వచ్చింది. 53 రోజులు నిజాన్ని బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది. పవనన్న ఏపీకి వస్తుంటే అడ్డుకుంటారు ఈ వైసీపీ పిరికి సన్నాసులు. ఆయన రావాలి అనుకున్న ఫ్లయిట్ క్యాన్సిల్ చేస్తారు. పవనన్నని ఏపీ బోర్డర్ లో ఆపేస్తారు. ప్రజాస్వామ్యాన్ని నువ్వు దెబ్బ తీశావ్ జగన్... ప్రజాస్వామ్యం తిరగబడి దెబ్బకొడితే ఎలా ఉంటుందో నువ్వు త్వరలోనే చూస్తావ్" అంటూ లోకేశ్ హెచ్చరించారు. 

జరగబోయేది జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం.... జగన్ అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజనరీ చంద్రబాబు గారు రాష్ట్రానికి కావాలి... ప్రజలకు మంచి చెయ్యాలి అనుకునే పవర్ ఫుల్ నాయకుడు పవనన్న రాష్ట్రానికి కావాలి అని లోకేశ్ పిలుపునిచ్చారు.


కోడికత్తి వారియర్స్ అని పేరు పెడితే బాగుంటుంది!

జగన్ కొత్త స్కీం తెచ్చాడు దాని పేరు ఆడుదాం ఆంధ్రా అంట. నాలుగున్నర ఏళ్లుగా ప్రజల జీవితాలతో ఆడుకున్నావ్ సరిపోదా జగన్? స్టేడియంలు, గ్రౌండుల‌లో ప్రాక్టీస్ చేయ‌డానికి, ఆడడానికి వ‌చ్చిన‌వాళ్ల‌ని ఫీజులు క‌ట్ట‌క‌పోతే రావొద్దంటూ త‌రిమేస్తున్నాడు ఈ జ‌గ‌న్. జ‌గ‌న్ ఐపీఎల్ టీము పెడ‌తామంటున్నాడు... దీనికి కోడిక‌త్తి వారియ‌ర్స్ అని పేరు పెడితే బాగుంటుంది.  సీనియ‌ర్ బ్యాట్స్ మన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అర‌గంట స్టార్ అంబ‌టి, గంట‌ స్టార్ అవంతి, ఆల్ రౌండ‌ర్ గోరంట్ల మాధ‌వ్, రీల్ స్టార్ భ‌ర‌త్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్ట‌ర్ బియ్యం మ‌ధు!... అబ్బో మామూలు టీము కాదు.

ప్రతి అడుగులో  జగన్ విధ్వంసం చూశా

పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకున్నాను. ఒక్క నాయకుడు చేసిన తప్పుల వలన రాష్ట్రం ఎంత నష్టపోయిందో కళ్లారా చూశాను. జగన్ విధ్వంసం ప్రతి అడుగులో చూశాను. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు, నకిలీ విత్తనాలతో రైతన్న నష్టపోతున్నాడు, తాగునీటి కోసం మహిళలు బిందెలు మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.  

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం తెచ్చిన ఎలక్ట్రానిక్స్, ఐటి కంపెనీలు కనిపించాయి... పాపాల పెద్దిరెడ్డి పది వేలకోట్ల అవినీతి సామ్రాజ్యం కనిపించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా, డ్రిప్ ఇరిగేషన్ కనపడింది... జగన్ తెచ్చిన కష్టాలు కనపడ్డాయి. 

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తెచ్చిన విమానాశ్రయం, మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించాయి... జగన్ మిగిల్చిన కన్నీరు కనిపించింది.

More Telugu News