55 లక్షల ఫోన్ నెంబర్లను నిలిపివేసిన కేంద్రం... కారణం ఇదే!

Union govt deactivates 55 laksh sim cards
  • పార్లమెంటులో వివరాలు తెలిపిన కేంద్రమంత్రి దేవుసింహ్
  • దేశవ్యాప్తంగా సంచార్ సాథీ వెరిఫికేషన్ కార్యక్రమం
  • తప్పుడు పత్రాలతో పొందిన సిమ్ కార్డుల ఏరివేత
తప్పుడు పత్రాలతో పొందిన సిమ్ కార్డులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. నకిలీ ధృవపత్రాలతో పొందిన 55 లక్షల ఫోన్ నెంబర్లను కేంద్రం రద్దు చేసింది. కేంద్రం కొంతకాలంగా 'సంచార్ సాథీ' పేరిట దేశవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కార్యక్రమం చేపడుతోంది. అక్రమ మార్గాల్లో పొందిన సిమ్ కార్డుల ద్వారా సైబర్ నేరాలు, ఇతర తప్పిదాలకు పాల్పడకుండా అడ్డుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే లక్షలాది సిమ్ కార్డులకు సరైన ధృవపత్రాలు లేవని గుర్తించారు. 

కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దేవుసింహ్ చౌహాన్ పార్లమెంటులో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. భారీ ఎత్తున వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టామని, తప్పుడు ధృవపత్రాలతో పొందిన  55.52 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు తెలిపారు. 

అంతేకాకుండా, సైబర్ నేరాలకు ఉపయోగించిన 1.32 లక్షల మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేసినట్టు మంత్రి వివరించారు. దాంతోపాటే, పౌరుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా ఉన్న 13.42 లక్షల ఫోన్ కనెక్షన్లను కూడా నిలిపివేసినట్టు తెలిపారు.
Go Back to Shorts
Sim Cards
Deactivate
Fraud
Fake Documents
Union Govt

More Telugu News