BJP: స్పీకర్ స్థానంలో ప్రసాద్ కుమార్ కూర్చున్నాకే బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం

  • స్పీకర్‌గా ప్రసాద్ కుమార్ ఎన్నిక తర్వాతే ప్రమాణం చేసిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు
  • ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఉండటంతో డిసెంబర్ 9న ప్రమాణం చేయని బీజేపీ ఎమ్మెల్యేలు
  • ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కొందరు అధికార, విపక్ష సభ్యులు 
BJP MLAs take oath after boycotting Protem Speaker Akbaruddin Owaisi

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎనిమిదిమంది బీజేపీ ఎమ్మెల్యేలు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ప్రమాణం చేశారు. వివిధ పార్టీల నుంచి గెలిచిన 99 మంది ఎమ్మెల్యేలు ఇటీవల ప్రమాణం స్వీకారం చేశారు. అయితే ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీకి అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాకే ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వారంతా ఈ రోజు ప్రసాద్ కుమార్ సమక్షంలో ప్రమాణం చేశారు. 

ఇక బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ కారణాలతో డిసెంబర్ 9న ప్రమాణం చేయని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేటీఆర్, కౌశిక్ రెడ్డి, కె ప్రభాకర్ రెడ్డి, టి పద్మారావు, పి రాజేశ్వర్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలను ప్రమాణ స్వీకారానికి పిలిచినా వారు దూరంగా ఉన్నారు. ప్రసాద్ కుమార్ స్పీకర్ సీట్లో కూర్చున్న తర్వాతే వారు ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి రాజాసింగ్, రామారావు పవార్ హిందీలో ప్రమాణం చేయగా, ఇతర ఎమ్మెల్యేలు తెలుగులో ప్రమాణం చేశారు.

More Telugu News