YS Sharmila: కేసీఆర్ ఇంటికిపోయే సమయం వచ్చేసింది.. బై బై కేసీఆర్: షర్మిల

  • కేసీఆర్ ను ఓడించడం కోసమే కాంగ్రెస్ కు మద్దతిచ్చామన్న షర్మిల
  • బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే అనే విషయం ప్రజలకు అర్థమయిందని వ్యాఖ్య
  • ఎమ్మెల్యేలను కొనే పనిని కేసీఆర్ చేయరాదని సూచన
YS Sharmila says bye bye KCR

తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని... ఇక సూట్ కేస్ సర్దుకోవడమేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు హైప్ రావడం వల్ల కేసీఆర్ ను దించే అవకాశం ఆ పార్టీకి వచ్చినందువల్ల ఆ పార్టీకి తాము మద్దతుగా నిలిచామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆత్మహత్యా సదృశం అయినప్పటికీ... కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. 

బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు కాబట్టి... తాము కాంగ్రెస్ కు మద్దతిచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్ల అయినా కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలనుకున్నానని తెలిపారు. తన సొంత పార్టీ వాళ్లే తనను విమర్శించినా, దూషించినా, వీడినా కేసీఆర్ ను ఓడించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తనను వీడిన వాళ్లు కేసీఆర్ తో చేతులు కలపడం తనను బాధించిందని అన్నారు. కేసీఆర్ పై ఎంతో పోరాటం చేసిన తర్వాత మళ్లీ ఆయనతో ఎందుకు కలిశారని ప్రశ్నించారు. 


కేసీఆర్ ప్యాకప్ చేసుకునే సమయం, ఇంటికి పోయే సమయం వచ్చిందని... ఆయనకు ఎండ్ కార్డ్ పడబోతోందని షర్మిల చెప్పారు.  ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నామంటూ... 'బై బై కేసీఆర్' అని రాసి ఉన్న సూట్ కేసును చూపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసే ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని చెప్పారు. కేసీఆర్ అవినీతి గురించి పూర్తిగా తెలిసినా కేంద్రంలోని బీజేపీ ఒక్క చర్య కూడా తీసుకోలేదని అన్నారు. కేసీఆర్ పెద్ద అవినీతిపరుడని మోదీ, అమిత్ షా లు సభల్లో చెపుతుంటారని... అలాంటప్పుడు ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికల ఫలితాలను తెలంగాణ ప్రజల రెఫరెండంగా కేసీఆర్ భావించాలని... ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయరాదని అన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ 40 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఒక్క ఎంపీని కొన్నారని దుయ్యబట్టారు. ఇది రిపీట్ కాకూడదని చెప్పారు.

More Telugu News