Yogi Adityanath: తెలంగాణ ఓటర్లకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆసక్తికర ఆఫర్

  • బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్య రామాలయ దర్శనం ఉచితమన్న యోగి
  • నరేంద్రమోదీ పాలనలో సరిహద్దు చాలా ప్రశాంతంగా ఉందన్న యూపీ సీఎం
  • రామమందిర నిర్మాణం కాంగ్రెస్ వల్ల సాధ్యమయ్యేదా? అని ప్రశ్న
Yogi Adityanath public meeting in Mahaboobnagar

తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరాముడి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహబూబ్ నగర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో సరిహద్దు ప్రశాంతంగా ఉందన్నారు. దేశంలో ఎలాంటి అలజడులు లేవన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కాంగ్రెస్ వల్ల అయ్యేదా? అని ప్రశ్నించారు. నడుస్తోంది నరేంద్రమోదీ ప్రభుత్వం అని, అవినీతిపరులను వదిలే ప్రభుత్వం కాదన్నారు.

ఎయిమ్స్, ఐఐటీ, జిల్లాకో మెడికల్ కాలేజీ, ఇంటింటికి నల్లా వంటి అనేక పథకాలను ప్రధాని మోదీ తీసుకువచ్చారన్నారు. అమరవీరుల ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ మాఫియా మాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులమయంగా చేశారని ఆరోపించారు. 

మహబూబ్‌నగర్‌ను పాలమూరుగా మార్చటం కోసమే వచ్చానని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. యూపీలో మాఫియాను బుల్డోజర్‌తో అణిచివేశామన్నారు. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అన్నారు. యూపీలో ఆరేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, తెలంగాణలో మాత్రం పేపర్ లీక్‌‌లతో నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.

More Telugu News