Kinjarapu Ram Mohan Naidu: లోకేశ్, భువనేశ్వరిపై నువ్వా విమర్శలు చేసేది?: విజయసాయిపై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం

  • విజయసాయి ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారన్న రామ్మోహన్
  • జగన్ దోపిడీలో విజయసాయి పాత్ర అందరికీ తెలుసని వెల్లడి
  • పదేళ్లుగా బెయిల్ పై ఊగిసలాడుతున్నాడంటూ 
Ram Mohan Naidu fires on Vijayasai Reddy

వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం కనుమరుగవుతోందని, దాన్ని భర్తీ చేసుకునేందుకు ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి దోచుకున్న అక్రమ సొమ్ములో నీ పాత్ర ఏంటో అందరికీ తెలుసు విజయసాయిరెడ్డి అని స్పష్టం చేశారు. విధానపరమైన విమర్శలు చేయడం రాని మీరు, రాజ్యసభ సభ్యులుగా ఉండి వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 

"ఉత్తరాంధ్రలో భూ కబ్జాల భాగోతం నుండి ఢిల్లీ లిక్కర్ స్కాం వరకూ నీ వాటా ఎంతో తెలుసు. చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆయన అనుమతి కోసం పిల్లిలా తిరిగిన నువ్వు విమర్శిస్తావా? లోకేశ్, భువనేశ్వరిపై విమర్శలు చేసే అర్హత నీకు లేదు. లోకేశ్, భువనేశ్వరి చేపట్టే సేవా కార్యక్రమాల్లో ఒక్క శాతమైనా నువ్వు చేయగలవా? కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్న గొప్ప మనసున్న వ్యక్తి లోకేశ్ అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విపత్తు ఉన్నా సేవా కార్యక్రమాలు నిర్వహించే మాతృమూర్తి భువనేశ్వరి. 

విశాఖ నడిబొడ్డునున్న రూ.2 వేల కోట్ల విలువైన దసపల్లా భూముల్ని బినామీలతో దోచుకున్నావు. 108 అంబులెన్సుల కొనుగోళ్లలో అల్లుడితో కలిసి రూ.307 కోట్ల ప్రజల సొమ్ము దిగిమింగావు. కేసుల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, పార్టీని తాకట్టు పెట్టుకున్న మీరా టీడీపీ గురించి మాట్లాడేది? అక్రమాస్తుల కేసులో ఏ1 జగన్ రెడ్డితో పాటు ఏ2గా ఉన్న నువ్వు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. 

వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, తప్పుదారి పట్టిస్తూ పదేళ్లుగా బెయిల్ పై ఊగిసలాడే నువ్వా చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించేది! షరతులతో బెయిల్ పై ఉన్న నువ్వు అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నావు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తంతే ప్రకాశం జిల్లాలో పడ్డావ్. అక్కడి వాసులు తంతే రేపు ఎక్కడ పడతావు తెలీదు. 

గజదొంగల ముఠాకు మేస్త్రీగా ఉన్న నువ్వు ఏపీలో పుట్టడం ప్రజల దౌర్భాగ్యం. నీ స్థానం, నీ గమ్యం ఎప్పటికైనా కటకటాలే. ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటావ్... ఏపీలో డాంభికాలు పలుకుతావ్... ఇదీ నీ చరిత్ర! ప్రజలు ఇచ్చిన గౌరవ స్థానాన్ని వారికి మంచిచేయడానికి ఉపయోగించుకో... లేదంటే ప్రజల్లో నీ మనుగడ కష్టం!" అంటూ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

More Telugu News