Ind Vs Aus: వరల్డ్‌ కప్ ఫైనల్స్‌కు ముందు టీమిండియాకు యువరాజ్ సింగ్ హెచ్చరిక!

  • భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ పైనల్స్‌పై యువరాజ్ కీలక వ్యాఖ్యలు
  • ఒత్తిడిని తట్టుకునే సత్తా ఆస్ట్రేలియాకు ఉందన్న యువరాజ్
  • అధికపొరపాట్లు జరిగితే భారత్‌‌కు ప్రమాదమని వార్నింగ్
  • టోర్నీలో పూర్తి ఆధిపత్యంతో ఉన్న భారత్‌కు కప్ గెలిచే అవకాశం మెండుగా ఉందని వ్యాఖ్య
Yuvraj Singhs Warning To India Ahead Of Cricket World Cup Final

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తుదిపోరుకు సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో ఓటమనేదే ఎరుగని టీమిండియా.. పలుమార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టబోతోంది. టీమిండియా మంచి ఫాంలో ఉన్నప్పటికీ అభిమానుల మనసుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టిన అనుభవంతో టీమిండియా ఎదుర్కొనే ప్రమాదం గురించి హెచ్చరించాడు. 

‘‘ఆస్ట్రేలియా క్రీడాకారులకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. అనేక పర్యాయాలు వాళ్లు ప్రపంచ కప్ గెలిచారు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్‌లోనూ పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా టీంను విజయతీరాలకు చేర్చారు. స్పెషలిస్టు బ్యాటర్లు అందరూ అవుటైనా తమ బాధ్యతను నిర్వర్తించారు. పెద్ద మ్యాచ్‌లకు ఆడే మానసిక ద్రుఢత్వం, నిలకడ ఉంది కాబట్టే వాళ్లు కీలక టోర్నీల్లో విజయం సాధించారు’’ అని యువరాజ్ చెప్పాడు. 

అయితే, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటా అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ శర్మ సేన ప్రస్తుతం ఓ పూర్తిస్థాయి టీంగా ఉందని యువరాజ్ సింగ్ కితాబిచ్చాడు. ‘‘కాబట్టి, ఈ మ్యాచ్‌లో భారత్ విఫలమయ్యే అవకాశాలు తక్కువ. అధిక పొరపాట్లతో మాత్రమే భారత్‌కు ప్రమాదం ఉంది. 2003 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. ఈసారి డామినేషన్ మొత్తం ఇండియాదే. ఆస్ట్రేలియన్ క్రీడాకారులు అద్భుతంగా ఆడితే తప్ప వారు గెలిచే అవకాశం లేదు’’ అని యువరాజ్ చెప్పాడు.

More Telugu News