G. Kishan Reddy: పవన్ కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారు: కిషన్ రెడ్డి

Kishan Reddy says Pawan Kalyan will campaign in telangana
  • కేసీఆర్‌కు మెడికల్ కాలేజీల కోసం కనీసం దరఖాస్తు చేయడం చేతకాలేదని విమర్శలు
  • ప్రధానితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనని దరిద్రపు ముఖ్యమంత్రి అని తీవ్ర విమర్శలు
  • బీజేపీ వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని ప్రకటన
  • బీసీలకు 39 సీట్లు కేటాయించి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీజేపీ అన్న కిషన్ రెడ్డి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీయేలో భాగస్వామి అని, ఆయన బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిగా చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్‌కు మెడికల్ కాలేజీల కోసం కనీసం దరఖాస్తు చేయటం చేతకాలేదని, కానీ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని చెబుతున్నారన్నారు. మెడికల్ కాలేజీలపై కేసీఆర్‌కు దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రధానితో కలసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనని దరిద్రపు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సీఎంగా కొనసాగితే రాష్ట్రానికి అరిష్టమన్నారు.

బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. సైన్స్ సిటీ అంటే ఏమిటో తెలియకుండానే హరీశ్ రావు మాట్లాడుతున్నారన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చెప్పారని గుర్తు చేశారు. ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను తాము రాగానే వాటిని ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేస్తుందన్నారు. తాను తన మంత్రిత్వశాఖలో పని నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నానన్నారు. అయోధ్యలో హిందూ, ముస్లిం మధ్య ఘర్షణ పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. రామమందిరం భూమి పూజ రోజున కాంగ్రెస్ ఎంపీలు నల్లదుస్తులు ధరించి పార్లమెంట్‌కు రావటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీది మైనార్టీ డిక్లరేషన్ కాదు.. హిందూ, ముస్లింల్ని విభజించే డిక్లరేషన్ అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే ఎలాంటి మార్పు రాదన్నారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తమదే అన్నారు. తాము 36 మంది బీసీలకు టిక్కెట్ ఇచ్చామని, జనసేన నుంచి ముగ్గుర్ని కలుపుకుంటే 39గా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ 22 మందికి, బీఆర్ఎస్ 23 మందికే ఇచ్చాయన్నారు. గజ్వేల్‌లో ఓడిపోతాననే కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారన్నారు. కామారెడ్డిలో కూడా తమ పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి ఖాయమన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు బానిస బతుకు మిగిలిందన్నారు.

  • Loading...

More Telugu News