Revanth Reddy: కేసీఆర్ పూర్వీకుల గ్రామ ప్రజలు ఇచ్చిన డబ్బుతో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్

  • ప్రత్యేక హెలికాప్టర్‌లో సిద్ధరామయ్యతో కలిసి కామారెడ్డికి చేరుకున్న రేవంత్ రెడ్డి
  • భారీ ర్యాలీతో వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ
  • కార్యక్రమంలో నారాయణ, చాడ, కోదండరాం, షబ్బీర్ అలీ తదితరులు
Revanth Reddy files nomination in Kamareddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి ఆయన కామారెడ్డికి చేరుకున్నారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్లిన రేవంత్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. రేవంత్ నామినేషన్ దాఖలు ప్రక్రియ సమయంలో సిద్ధరామయ్య, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, ఆ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కర్ణాటక మంత్రి బోస్ రాజు తదితరులు ఉన్నారు.

విరాళాలు సేకరించిన కేసీఆర్ పూర్వీకుల గ్రామస్తులు

కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కొనాపూర్‌కు చెందిన ప్రజలు కొంత డబ్బులను  విరాళాల రూపంలో సేకరించి రేవంత్ రెడ్డికి అందించారు. ఈ డబ్బును రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వినియోగించారు. రేవంత్ రెడ్డి ఈ నెల 6న తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. కాగా, గతంలో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి షబ్బీర్ అలీ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి వరకు కామారెడ్డి నుంచి పోటీచేసిన షబ్బీర్ అలీ ఈసారి నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో నిలిచారు.

More Telugu News