renuka choudhary: కాళేశ్వరం ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఒప్పుకొని చెంపలు వేసుకోవాలి: రేణుకా చౌదరి

  • కేసీఆర్ కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ
  • కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన రాజకీయ స్వలాభం కోసం కాదన్న రేణుకా చౌదరి
  • కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బంగారం అంతా కేసీఆర్ ఇంటికి చేరిందన్న కాంగ్రెస్ నేత
Renuka Choudhary fires at cm kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, అధికార మదంతో విర్రవీగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసమే కాదన్నారు. ప్రతి వ్యక్తిపై బీఆర్ఎస్ రూ.లక్షకు పైగా అప్పు భారం వేసిందన్నారు. దొంగ విత్తనాలు మూలంగా ఎనిమిదివేల మంది రైతు కుటుంబాలు నాశనమయ్యాయని మండిపడ్డారు. అయినప్పటికీ కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. ఈ ప్రభుత్వం కౌలు రైతుని మరిచిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను దృష్టిలో పెట్టుకొని కూడా పని చేస్తుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బంగారమంతా కేసీఆర్ ఇంటికి చేరిందన్నారు. గతంలో తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని పక్కన పెట్టి గెలిపిస్తే రైతులకి కేసీఆర్ చేసిందేమిటి? అని నిలదీశారు. ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూములు కాజేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన దోపిడీని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాళేశ్వరం విషయంలో క్వాలిటీ కంట్రోల్ ఏమయింది? అని నిలదీశారు. ఈ భారీ ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటి? ప్రాజెక్టు పక్కన ఊళ్ల గురించి, ప్రజల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఒప్పుకొని చెంపలు వేసుకోవాలన్నారు. ధరణి పోర్టల్ ఎందుకు పనిచేయటం లేదో చెప్పాలన్నారు. ఈ పోర్టల్ వల్ల సామాన్యుడికి మేలు జరిగిందా? అన్నది చెప్పాలన్నారు. కేజీ టు పీజీ విద్య ఎక్కడకు పోయిందో చెప్పాలన్నారు.

More Telugu News