ఒకే కులానికి చెందిన వాళ్లు నాపై దాడికి యత్నించారు: అంబటి రాంబాబు
- ఖమ్మంలో అంబటి రాంబాబును అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
- కులోన్మాదులు దాడి చేశారంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు
- నిన్న తన కారుపై గోధుమల బస్తాలు పడ్డాయన్న మంత్రి
నిన్న తన కారుపై గోధుమల బస్తాలు పడ్డాయని, ఈరోజు ఏకంగా దాడికే యత్నించారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోమని... ఇలాంటి ఉన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కార్తీక వనభోజనాల సమయంలో తనను చంపేసిన వారికి రూ. 50 లక్షలు ఇస్తామని ప్రకటించారని... ఆ రోజు దాడికి ప్రయత్నించిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. కులోన్మాదంతోనే వంగవీటి రంగాను హత్య చేశారని, ముద్రగడపై దాడి చేశారని అన్నారు. చంద్రబాబుపై ప్రేమ ఉంటే మరో రూపంలో చూపించుకోవాలని... ఇలా తమపై దాడికి పాల్పడటం సరికాదని చెప్పారు. తనకు కూడా ఒక కులం ఉందనేది తనపై దాడి చేసిన వారు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.