Har ki doon: హిమాలయాలను అధిరోహించిన హైదరాబాద్ చిన్నారి

Hyderabadi Girl Arshi creates record in Har ki doon Trekking
  • తొమ్మిదేళ్ల వయసులోనే రికార్డులకెక్కిన ఆర్షి
  • ఏడు రోజుల్లో ‘హర్ కీ డూన్’ పర్వతం అధిరోహణ
  • ఆరు నెలల పాటు తల్లిదండ్రుల శిక్షణ
ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లే వయసులోనే ఓ చిన్నారి హిమాలయ పర్వతాన్ని అధిరోహించింది. అదీ తక్కువ సమయంలో పూర్తిచేసి రికార్డులకెక్కింది. తన వయసు పిల్లలు పది రోజులు కష్టపడితే కానీ ఎక్కలేని శిఖరాన్ని ఏడు రోజుల్లోనే చేరుకుంది. తల్లిదండ్రులతో కలిసి అడుగులేస్తూ ట్రెక్కింగ్ పూర్తిచేసింది. ఆ చిన్నారి మన హైదరాబాదీ కావడం విశేషం.

నానక్ రామ్ గూడలోని ద శ్రీరామ్ యూనివర్సల్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆర్షి ఈ ఘనత సాధించింది. ఈ నెల 14న తన తల్లిదండ్రులు అంజనా, సోహన్ లతో కలిసి హిమాలయాలలో భాగమైన ఉత్తరాఖండ్ లోని గర్హివాల్ లో ట్రెక్కింగ్ ప్రారంభించింది. 12 వేల అడుగుల ఎత్తున్న ‘హర్ కీ డూన్’ పర్వతాన్ని అధిరోహించడానికి పెద్ద వారికైతే ఐదారు రోజులు, పిల్లలకు పది రోజుల సమయం పడుతుంది. అయితే, ఆర్షి మాత్రం ఏడు రోజుల్లోనే.. అంటే ఈ నెల 21న శిఖరాగ్రం చేరుకుంది. దీంతో ఆర్షి పేరు రికార్డుల్లోకి చేరింది.

ఈ ట్రెక్కింగ్ పోగ్రాం కోసం ఆర్షికి స్వయంగా ఆరు నెలల పాటు శిక్షణ అందించినట్లు వివరించారు. అయితే, ఇదంతా సులభంగా ఏమీ జరగలేదని ఆర్షి తల్లిదండ్రులు చెప్పారు. ట్రెక్కింగ్ ప్రారంభించిన రెండో రోజే ఇబ్బందులు మొదలయ్యాయని వివరించారు. తొలుత వర్షం ఇబ్బంది పెట్టగా తర్వాత బలమైన గాలులు, హిమపాతం రూపంలో సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. అయినా పట్టుదలతో ముందుకే వెళ్లామని చెప్పారు.
Har ki doon
Arshi
Trekking
Hyderabadi girl
Himalayas
Nanakram guda

More Telugu News