Telangana Assembly Election: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం

  • 20వ పిల్లర్ వద్ద కుంగిన బ్యారేజీ
  • ఆరుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
  • బ్యారేజీని పరిశీలించిన అనిల్ జైన్ నేతృత్వంలోని కేంద్ర కమిటీ
Central Team inspected medigadda barriage

మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద కుంగిన విషయం తెలిసిందే. దీంతో ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని కేంద్ర కమిటీ ఈ బ్యారేజీని నేడు పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించింది. బ్యారేజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేయనుంది. సమగ్ర పరిశీలన అనంతరం కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందిస్తుంది.

కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఉన్నారు. ఈ బ్యారేజీ కుంగడంతో నీటిని విడుదల చేశారు. నీటి మట్టం కనిష్ఠస్థాయికి చేరుకుంది. బ్యారేజ్ ఎగువ నుంచి 57 గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. మూడు రోజుల క్రితం రాత్రి భారీ శబ్దంతో బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగిపోయింది. దీంతో బీ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. క్రస్ట్ గేటుకు పగుళ్లు వచ్చాయి.

More Telugu News