Revanth Reddy: మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణం: రేవంత్ రెడ్డి

  • కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు
  • మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగిపోయిన పిల్లర్
  • కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమేనన్న రేవంత్
  • సీవీసీతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని వెల్లడి
Revanth Reddy reacts to Medigadda incident

మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బ్యారేజ్ వద్ద పిల్లర్ కుంగిపోవడానికి కారణం కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబం అని విమర్శించారు. 

నాణ్యతా లోపంతోనే మేడిగడ్డ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని రేవంత్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. మేడిగడ్డ ఘటనపై  కేంద్ర హోంమంత్రి, గవర్నర్, ఈసీ విచారణకు ఆదేశించాలని కోరారు. 

మేడిగడ్డకు వెళ్లేందుకు ఈసీకి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు కూడా తమతో కలిసి మేడిగడ్డకు రావాలని డిమాండ్ చేశారు.

More Telugu News