Teja Nidamanuru: పాక్ తో నెదర్లాండ్స్ పోరు... నిరాశపరిచిన తెలుగుతేజం

  • వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్ తో నెదర్లాండ్స్ ఢీ
  • తొలుత 49 ఓవర్లలో 286 పరుగులు చేసిన పాక్
  • లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ కు కష్టాలు
  • 34 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసి నెదర్లాండ్స్
Teja Nidmanuru disappoints against Pakistan

ఇవాళ హైదరాబాదులో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో ఓ దశ వరకు మెరుగ్గానే కనిపించిన నెదర్లాండ్స్... ఉన్నట్టుండి వరుసగా వికెట్లు  కోల్పోయి కష్టాల్లో పడింది. 

నెదర్లాండ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుతేజం తేజ నిడమనూరు ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో వీరోచిత సెంచరీతో నెదర్లాండ్స్ కు బెర్తు ఖరారు చేసి, విండీస్ ను తొలిసారి వరల్డ్ కప్ కు దూరం చేసిన తేజ నిడమనూరుపై ఇవాళ్టి మ్యాచ్ లో నెదర్లాండ్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ తేజ 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. పాక్ ఎక్స్ ప్రెస్ బౌలర్ హరీస్ రవూఫ్ బౌలింగ్ లో ఫఖార్ జమాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తం 9 బంతులాడిన తేజ ఒక ఫోర్ కొట్టాడు. 

ఇక, నెదర్లాండ్స్ స్కోరు విషయానికొస్తే... 34 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన బాస్ డీ లీడ్ 67 పరుగులు చేసి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 2, షహీన్ అఫ్రిది 1, హసన్ అలీ 1, ఇఫ్తికార్ అహ్మద్ 1, మహ్మద్ నవాజ్ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు.

More Telugu News