Nara Bhuvaneswari: నా ఆయుష్షు కూడా పోసుకుని చంద్రబాబు జీవించాలి: నారా భువనేశ్వరి

  • రాజమండ్రిలో ఒక్కరోజు నిరాహార దీక్ష విరమించిన భువనేశ్వరి
  • చంద్రబాబు అరెస్ట్ తమ కుటుంబాన్ని మనోవేదనకు గురిచేసిందన్న భువనేశ్వరి
  • నలుగురం నాలుగు దిక్కులుగా అయిపోయామని ఆవేదన
  • ఏనాడూ ఇలా బయటికొచ్చి మాట్లాడతానని అనుకోలేదని వెల్లడి
Bhuvaneswari speech in Rajahmundry

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నేడు గాంధీ జయంతి వేళ నారా భువనేశ్వరి రాజమండ్రిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం 5 గంటలకు ఆమె నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. అనంతరం ఆమె ప్రసంగించారు. 

చంద్రబాబు అరెస్ట్ తమ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. చంద్రబాబు, తాను, లోకేశ్, బ్రాహ్మణి నలుగురం నాలుగు దిక్కులుగా అయిపోయామని ఆవేదన వెలిబుచ్చారు. 

"ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ దీక్షలో నేను పాల్గొన్నది చంద్రబాబు కోసమో, మా కుటుంబం కోసమో కాదు. ప్రజల కోసం. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తడానికి ఈ దీక్షలో పాల్గొన్నాను. నాడు తెల్లదొరలపై పోరాడి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదు. ఆయన ఎంతో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ జైలు నుంచి బయటికి వచ్చాక ప్రజలతో కలిసి మళ్లీ పోరాడారు. 

ఇలా పబ్లిక్ మీటింగుల్లో, రాజకీయ సభల్లో ప్రసంగించడం నాకు అలవాటు లేదు. కానీ ప్రజలంతా నా వెంట ఉన్నారన్న ధైర్యం నాకుంది. కుటుంబానికి కూడా కొంచెం సమయం కేటాయించండి అని ఒకప్పుడు చంద్రబాబునాయుడ్ని నిలదీసేదాన్ని. ఇవాళ చెబుతున్నాను... నా ఆయుష్షు కూడా పోసుకుని ఆయన జీవించాలి... ఇంకా ప్రజాసేవ చేయాలనేదే నా ఆకాంక్ష. సత్యమేవ జయతే... అహింసా నినాదాలను నేను నమ్ముతాను... ఆ సత్యం కోసమే నేను ఇవాళ దీక్షలో పాల్గొన్నాను. 

ఎన్టీఆర్ నీతినిజాయతీ, క్రమశిక్షణే ప్రాతిపదికగా ముందుకెళ్లారు... ఆయన అడుగుజాడల్లోనే మేం నడుస్తున్నాం. ఇప్పటివరకు మా కుటుంబంపై ఒక్క ఆరోపణ లేదు, ఒక్క కేసు కూడా లేదు. మా పనేదో మేం చేసుకుంటూ వెళుతుంటాం. అందుకు కారణం ఎన్టీఆర్ నేర్పించిన క్రమశిక్షణే.

నా తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు, నా భర్త ముఖ్యమంత్రిగా చేశారు... కానీ ఎప్పుడూ ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. చంద్రబాబును ఎప్పుడూ మేం ఆపలేదు. ఆయనకిష్టమైన ప్రజాసేవ చేసుకోమని ప్రోత్సహించాం. కానీ, ఇవాళ మేం తలో దిక్కుగా అయిపోయాం. మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. 

పాతికేళ్ల కిందటే చంద్రబాబు ఐటీ గురించి ఆలోచించారు. సైబరాబాద్ ఐటీ కేంద్రంగా ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. బిల్ గేట్స్, క్లింటన్ వంటి ప్రముఖులు హైదరాబాద్ వచ్చారంటే అందుకు కారణం చంద్రబాబు. హైదరాబాదులో పేరుమోసిన ఐటీ కంపెనీలు వచ్చాయంటే చంద్రబాబు కఠోరశ్రమే కారణం. చంద్రబాబు రోజుకు 19 గంటలు పనిచేస్తారు. 

విభజన తర్వాత ఏపీలో పోలవరం, అమరావతి గురించి కలలు కన్నారు. విభజన తర్వాత సీఎం అయ్యాక ఆయన పడిన కష్టం ఎప్పుడూ చూడలేదు. రోజుకు కేవలం మూడ్నాలుగు గంటలే నిద్రపోయేవారు. ఒక ఇల్లు కట్టాలంటేనే కొన్నిసార్లు రెండేళ్ల సమయం పడుతుంది. అలాంటిది ఏమీ లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించండి. 

కానీ ప్రజలు చంద్రబాబును దూరం చేసుకున్నారు. ఈసారి అటువంటి పొరపాటు జరగనివ్వవద్దు. మీ ఓటు వేసి టీడీపీని గెలిపించండి. మేం అందరం జైలుకు వెళ్లినా మాకు బాధలేదు... పార్టీని నడిపించే కార్యకర్తలు మాకున్నారు... వాళ్లే పార్టీని ముందుకు తీసుకెళతారు" అంటూ భువనేశ్వరి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

More Telugu News