tdp: 13వ రోజు టీడీపీ శ్రేణుల ఆందోళనలు.. పలుచోట్ల బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మద్దతు

TDP protest on 13th day in andhra pradesh
  • అన్నవరంలో సత్యదేవుడిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
  • చంద్రబాబు నిర్దోషిగా తిరిగి రావాలని దేవుడ్ని కోరుకున్న భువనేశ్వరి
  • అనంతపురం, కొడుమూరు, రాప్తాడు తదితర ప్రాంతాల్లో దీక్షలు
  • విజయవాడలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రులు
  • శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు 13వ రోజు కొనసాగాయి. మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలతో నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మహాయాగం నిర్వహించారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో నారా భువనేశ్వరి సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నిర్దోషిగా విడుదల కావాలని ఆమె కోరుకున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ "ఆమరణ నిరాహారదీక్ష" చేపట్టారు. రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేట పరిధిలోని జొన్న ఐరన్ మార్ట్ నందు మాజీ మంత్రి పరిటాల సునీత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

కొడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి ఆకేపోగు ప్రభాకర్ ఆధ్వర్యంలో కొడుమూరులో టీడీపీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన ద్వారా నిరసన తెలియజేశారు. అనంతరం రిలే దీక్షలో పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలం, పేరాంటాల పాలెం గ్రామంలో శివుడికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 500మంది మహిళలు శారదానదిలో బిందెలుతో నీళ్ళు తెచ్చి శివుడికి అభిషేకం చేశారు. పరమశివుడి అనుగ్రహంతో చంద్రబాబు  క్షేమంగా తిరిగి రావాలని పూజలు నిర్వహించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పాతూరు మాసుంబి దర్గా నుండి పెనుగొండ బాబయ్య దర్గా వరకు నాలుగు రోజుల పాదయాత్రను నాయకులు ప్రారంభించారు.

తెలుగుదేశం హాయంలో విజయవాడ సిద్ధార్థ కాలేజీలో నెలకొల్పిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును, అందులో ఉన్న పరికరాలను మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం, కొనకళ్ళ నారాయణరావు, పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు పరిశీలించారు. మాడుగుల నియోజకవర్గంలో నియోజకవర్గ ఇంఛార్జ్ పి.వి.జి కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో శాంతియుతంగా నిరాహారదీక్ష చేసుకొనుటకు పోలీస్ కమిషనర్ అనుమతి తిరస్కరించడంతో, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు కలిసి అనుమతి ఇవ్వాలని కోరారు.

శాంతియుతంగా నిరసన చేస్తున్న సామాన్య ప్రజలను, రాజకీయ నాయకులను తీవ్ర ఇబ్బంది పెడుతూ మానవ హక్కులను ఉల్లంఘన చేస్తున్నారని కృష్ణా జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి జిల్లా నాయకులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన చేపట్టారు. అనంతరం గుండుమల తిప్పేస్వామి ముత్తెపల్లి గేట్ నుంచి అగలి శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం వరకు, అక్కడి నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అగలి శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయంలో చంద్రబాబు త్వరగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం పావగడ పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టి , ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి రాజకీయ పార్టీల నేతలు, ఐటీ నిపుణులు, బాలకృష్ణ ఫ్యాన్స్, పవన్ కల్యాణ్ అభిమానులు మద్దతు తెలిపారు. అనంతరం పావుగడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉంగుటూరు నియోజవర్గం ఉంగుటూరు గ్రామంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో జలదీక్ష నిర్వహించారు. శింగనమల నియోజకవర్గం  నాయనపల్లి క్రాస్ వద్ద నిరసన తెలియజేస్తుండగా రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజును పోలీసులు అరెస్టు చేసి శింగనమల పోలీస్ స్టేషన్ కు తరలించారు. చంద్రబాబును జైలు నుంచి త్వరగా విడుదల చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. పుట్టపర్తి నియోజకవర్గం చిత్రావతి నదిలో మాజీ మంత్రి జలదీక్ష నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో చంద్రబాబు ఆక్రమ అరెస్ట్ కు నిరసనగా స్కిల్ డెవలప్మెంట్ విద్యార్థులు నిరసన దీక్ష చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయం నుంచి పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, ప్రణవ్ గోపాల్, పుచ్చా విజయ్, అనంతలక్ష్మి, ఇతర నాయకులు మొబైల్ ఫ్లాష్ లైట్లతో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యకర్తల ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని రోడ్డుపైకి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.

చంద్రబాబునాయుడు గారికి న్యాయం చెయ్యాలని న్యాయదేవతని కోరుతూ కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రావులపాలెంలో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలలో పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, ఎండీ షరీఫ్, రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, బుద్దా నాగజగధీశ్వరరావు, జ్యోతుల నవీన్, కె.ఎస్ జవహార్, తెనాలి శ్రావణ్ కుమార్, జీవి ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, మల్లెల లింగారెడ్డి, పులివర్తి నాని, నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News