Payyavula Keshav: చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆత్మరక్షణలో జగన్ ప్రభుత్వం: పయ్యావుల

  • కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేశారన్న పయ్యావుల కేశవ్
  • అధికారులను విచారించకుండా చంద్రబాబుపై ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్న
  • స్కిల్ కేంద్రాల్లో ఏ ఎక్విప్‌మెంట్ అడిగితే అది ఉంటుందని స్పష్టీకరణ
Payyavula says ysrcp government in self difence after chandrababu arrest

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచీ అసత్య ప్రచారం చేస్తూ, న్యాయస్థానాలకు కూడా అసత్యాలు, అర్థసత్యాలే చెబుతోందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని టీడీపీ శాసనసభ్యులు, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు మూలాధారమని ప్రభుత్వం, సీఐడీ చెబుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌ను ప్రయివేటు సంస్థ అయిన శరత్ అసోసియేట్స్ చేసిందన్నారు. ఈ సంస్థ, ఐ.వీ.ఎస్ అసోసియేట్స్ అనే మరో సంస్థ ఒకే కంప్యూటర్‌ను వినియోగిస్తూ, ప్రభుత్వానికి పని చేస్తున్నాయన్నారు.

ప్రభుత్వం తమకు అనుబంధంగా పనిచేసే సంస్థతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లో ఆడిట్ నిర్వహించి, కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించిందని దీన్నిబట్టే అర్థమవుతోందన్నారు. ఐ.వీ.ఎస్ అసోసియేట్స్ సంస్థ జగన్‌కు చెందిన కంపెనీలైన కార్మెల్ ఏషియా, ఇతర సంస్థల ఆడిట్స్ నిర్వహిస్తూ ఉంటోందన్నారు. ఆ సంస్థ ఆడిటింగ్ వ్యవహారాలు నిర్వహించే కంప్యూటర్ ద్వారానే శరత్ అసోసియేట్స్ సంస్థ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆడిట్ కార్యకలాపాలు నిర్వహించి, జగన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు.

స్కిల్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని శిక్షణా కేంద్రాల్లో తొలుత ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని జగన్ సర్కార్... శరత్ అసోసియేట్స్‌కు సూచించిందని, ఆ తర్వాత ఆర్.ఎఫ్.పీ ప్రపోజల్ పెట్టే సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్ వద్దని చెప్పారన్నారు. ఇక్కడే ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతోందన్నారు. శరత్ అసోసియేట్స్ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టర్ నాలుగు పేపర్లు చదివి, వాటిలో తనకు ఇదిగో ఈ తేడా కనిపించిందని చెప్పగానే, పోలోమంటూ ఈ ప్రభుత్వం మొత్తం వ్యవహారం నడిపిన అధికారుల్ని వదిలేసి, చంద్రబాబు తప్పుచేశాడంటూ ఆయన్ని అరెస్ట్ చేయడం కక్షసాధింపు కాక మరేమిటి? అని ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వం శరత్ అసోసియేట్స్ సంస్థను ఫిజికల్ వెరిఫికేషన్ చేయవద్దని ఎందుకు చెప్పిందంటే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని 42 శిక్షణా కేంద్రాల్లో సీమెన్స్ సంస్థ ప్రపోజల్ ప్రకారం అన్నిరకాల నట్లు, బోల్టులు, ఆఖరికి గుండుసూదులు కూడా ఉన్నాయని, అందుకే ఫిజికల్ వెరిఫికేషన్ వద్దని శరత్ అసోసియేట్స్ సంస్థకు జగన్ ప్రభుత్వం చెప్పిందన్నారు. 42 శిక్షణా కేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు, సాఫ్ట్‌వేర్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదని ధృవీకరించే వీడియోలను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 30 గంటల నిడివిగల వీడియోలు పరిశీలిస్తే శిక్షణా కేంద్రాల్లో ఎలాంటి పరికరాలు  ఉన్నాయో కళ్లకుకట్టినట్టు కనిపిస్తుందన్నారు.

అంత నిడివిగల వీడియోలు పరిశీలించడం కష్టమవుతుందని తెలిసి, 42 కేంద్రాల్లోని పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివరాలను తెలియచేస్తూ 6 నిమిషాల నిడివిగల వీడియోను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 30 గంటల నిడివిగల ఈ వీడియోలు తాము చేసినవి కావని, ఈ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో తీసినవేనని స్పష్టం చేశారు. వీడియోలను చూశాక పరికరాలు లేవు అని చెప్పేందుకు ఆస్కారం లేదన్నారు. ఎందుకంటే 42 శిక్షణా కేంద్రాల నిర్వాహకులు తమకు అన్నిరకాల పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందినట్టు నిర్దారిస్తూ ధృవీకరణ పత్రాలు అందించారన్నారు. అవి కూడా మీడియా వారికి అందిస్తున్నామన్నారు. వీడియాలు, ధృవీకరణ పత్రాలను ఇటీవల టీడీపీ విడుదలచేసిన వెబ్ సైట్లో కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. పరికరాలు, సాఫ్టువేర్‌కు సంబంధించి సీమెన్స్ సంస్థ ఇచ్చిన 160 ప్రపోజల్స్‌ను కూడా మీడియా ముందు ఉంచామన్నారు.

ఇంత స్పష్టంగా స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కేంద్రాల్లో అన్ని రకాల పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, లేదని నమ్మించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం ముమ్మాటికీ కక్ష సాధింపులో భాగమే అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆర్జా శ్రీకాంత్ అనే అధికారి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లో భాగమైన డిజైన్ టెక్, సిమెన్స్ సంస్థలు అద్భుత పనితీరును కనబరిచాయని ప్రశంసాపత్రం కూడా అందించారని గుర్తు చేశారు. వీడియోలు, ధృవీకరణ పత్రాలతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాల్సిన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి సిమెన్స్ సంస్థ ఇచ్చిన 160కు పైగా ప్రపోజల్స్‌ను కూడా మీడియాకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంత సమాచారం ఉన్నా తప్పు జరిగిందని ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు.

కేంద్రప్రభుత్వం అద్భుతమని కొనియాడిన ప్రాజెక్ట్.. జగన్ ప్రభుత్వానికి నేరంగా కనిపిస్తోందన్నారు.
ప్రభుత్వం ముందే అనుకున్న విధంగా శరత్ అసోసియేట్స్‌తో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో తూతూమంత్రంగా ఆడిట్ నిర్వహించిందన్నారు. ఆ సంస్థ, జగన్ సంస్థలకు చెందిన ప్రయివేటు ఆడిటర్లు కలిసే పనిచేస్తున్నారనడానికి ఒకే కంప్యూటర్ వినియోగిం చడమే నిదర్శనమన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే ఈ ప్రభుత్వ కుట్ర ఏమిటో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. నేడు మీడియా వారికి ఇచ్చిన సమాచారాన్నే రేపు న్యాయస్థానాల ముందు కూడా ప్రవేశపెడతామన్నారు. కేంద్రప్రభుత్వ అధీనంలోని సంస్థలన్నీ కూడా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అమలు చేసిన విధానాన్ని పరిశీలించాలని కోరుతూ కేంద్రప్రభుత్వ సెక్రటరీ రాసిన లేఖను కూడా త్వరలో బహిర్గతం చేయనున్నట్లు తెలిపారు. శరత్ అసోసియేట్స్ ఆడిట్ రిపో ర్ట్ తప్పని తాము తొలి నుంచీ చెబుతున్నామని, దానికి  సంబంధించిన వీడియోలు నేడు విడుదల చేశామన్నారు. శరత్ అసోసియేట్స్ తప్పుచేసిందని ఆ వీడియోలు చూస్తే అర్థమవుతుందన్నారు.

More Telugu News