Ramcharitmanas: రామచరితమానస్ ఓ సైనైడ్.. బీహార్ మంత్రి సంచలన వ్యాఖ్య

  • హిందూ మత గ్రంథాలు సైనైడ్ కలిపిన ఆహారమంటూ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్య
  • ఈ విషయంలో తన అభిప్రాయాలు స్థిరమైనవని స్పష్టీకరణ
  • మురుగులో దిగేవారి కులాలు మారే వరకూ దేశంలో రిజర్వేషన్ల అవసరం ఉంటుందని వ్యాఖ్య
Bihar minister compares Ramcharitmanas to cyanide

బీహార్ మంత్రి చంద్రశేఖర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్‌ను సైనైడ్‌తో పోల్చి కలకలం రేపారు. బుధవారం హిందీ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘సైనైడ్ కలిపిన ఓ యాభై ఐదు రకాల ఆహార పదార్థాలను వడ్డిస్తే మీరు తింటారా? హిందూ మత గ్రంథాల విషయం కూడా ఇంతే. రామచరితమానస్ గ్రంథం విషయంలో నా అభిప్రాయాలు స్థిరమైనవి. నా జీవితాంతం అవి నిలిచి ఉంటాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా వీటిపై వ్యాఖ్యానించారు. మురుగులో దిగేవారి కులం మారేవరకూ దేశంలో రిజర్వేషన్లు, కులగణన అవసరం ఉండి తీరుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలపై సీఎం నితీశ్ కుమార్‌ టార్గెట్‌గా బీజేపీ విమర్శలు గుప్పించింది. ‘‘మంత్రి చంద్రశేఖర్ వరుసగా రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. నితీశ్ కుమార్‌కు ఇవి వినపడట్లేదా? నితీశ్ నిరంతరంగా సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు. సనాతన ధర్మంతో చంద్రశేఖర్‌కు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయనను మతం మార్చుకోమనండి’’ అంటూ బీజేపీ ప్రతినిధి నీరజ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News